కామారెడ్డి, మార్చి 22 : ఉగాది పర్వదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో ఉన్న దుర్గమ్మ ఆలయ ఆవరణలో ఎడ్లబండ్ల ప్రదర్శన బుధవారం అట్టహాసంగా కొనసాగింది. పట్టణ రెడ్డి సంఘం ఎడ్ల బండిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలు పాడి పంటలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాక్షించారు. అన్ని రంగాల వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ ఉత్సవాల సంస్కృతిని రాబోయే తరాల వారికి అందించాలన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో ఉండే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రంలో 20 నుంచి 30 ఎడ్లబండ్లను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ…. కామారెడ్డిలో సదరు సంఘం ఆధ్వర్యంలో ఏటా ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సదర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎడ్ల బండ్ల ప్రదర్శన సందర్భంగా పోలీసులు భారీబందోబస్తును ఏర్పాటు చేశారు.