ఏర్గట్ల, జనవరి 24 : గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో ఎస్సై కోరడే రాజుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండల కేంద్ర శివారులోని శివాలయం ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో అక్కడి వెళ్లారు. పోలీసులను చూసిన వారు పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని పట్టుకొని పరిశీలించగా వారి వద్ద రెండు వందల గ్రాముల గంజాయి లభించింది.
గంజాయి విలువ సుమారు రూ.7వేలు ఉంటుంది. నిందితుల్లో మెట్పల్లి మండలం రంగారావు పేటకు చెందిన డ్రైవర్ గోరే శ్రావణ్తో మరో బాలుడు ఉన్నాడు. వీరు మెట్ల చిట్టాపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారన్నారు. గంజాయి విక్రయించినా, సేవించినా చట్టరీత్యా నేరమని.. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ, ఎస్సై సూచించారు. పోలీస్ సిబ్బంది సేర్ధక్, గంగాధర్, విజయ్, సురేశ్, శేఖర్, జగదీశ్లను అభినందిస్తూ సీపీ చేతుల మీదుగా రివార్డులు అందజేస్తామని సీఐ తెలిపారు.