
MLA Vemula Prashanth Reddy | నిజామాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ నామస్మరణ, ఆయనపై విమర్శలు చేయడం మాని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బాకీ కార్డులతో మంగళవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకు ఏమీ చేయలేదని, రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ నదిపై తాము నిర్మించిన వంతెనను నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, కేవలం రిబ్బన్ కటింగ్లు చేస్తూ బీఆర్ఎస్ పనులను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.అభివృద్ధి గురించి మాట్లాడకుండా అక్కడ కూడా మూసి కంటే కంపు నోరుతో కేసీఆర్పై విషం కక్కేందుకే సమయం కేటాయించారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగిస్తున్నామని వేముల స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు 100 శాతం సంపూర్ణ బాధ్యతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మేధోమథనం, వ్యూహాత్మక దిశానిర్దేశం ప్రకారమే పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎండగడుతోందని వేముల అన్నారు. ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యుల అవినీతి, భూ ఆక్రమణలపై నిరంతరం పోరాటం సాగిస్తున్నామని, ‘హైడ్రా’ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న భారీ అవినీతిని ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.
లగచర్లలో రైతుల భూములను అన్యాయంగా లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రతిష్టాత్మక ఫార్మాసిటీని రద్దు చేసి, ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో 14,000 ఎకరాల విలువైన భూములను అమ్ముకునేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత వెల్లడించిన రూ.200 కోట్ల భూ ఆక్రమణల ఉదంతంతో సహా కాంగ్రెస్ నాయకుల అక్రమాలను నిలదీస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై అండగా నిలబడి పోరాడుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రతిపక్షాలపై నిరాధార ఆరోపణలు, దూషణలు మాని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. నిత్యం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే, ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పి మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.