కమ్మర్పల్లి, అక్టోబర్ 17: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు అన్నారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 93 లక్షల మందికి రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం పేదలకు కష్ట కాలంలో ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు.93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పథకం పేదలపై కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇలా ఎన్నో సంక్షేమ పథకాల కొనసాగింపు, పెంపు, కొత్త సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డి పార్టీలు ఒక వైపు… తెలంగాణను తెచ్చి దేశంలోనే నంబర్ వన్గా నిలిపిన కేసీఆర్ మరో వైపు ఉన్నారన్నారు. బాల్కొండ నియోజక వర్గంలో రోజుకో పార్టీ మారే నాయకుడు ఒక వైపు..23 ఏండ్లుగా ఉద్యమ నాయకుడిని, ఉద్యమ పార్టీని వీడక బాల్కొండను మరో సిరిసిల్ల, గజ్వేల్లా తీర్చిదిద్దుతూ పోతున్న వేముల ప్రశాంత్ రెడ్డి మరో వైపు ఉన్నారన్నారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ గమనించాలని కోరారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు మైలారం సుధాకర్, గడ్డం స్వామి, బద్దం రాజ శేఖర్, చితం గణేశ్, తదితరులు పాల్గొన్నారు.