ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో విలువైన వేలాది ఎకరాల నిజాంషుగర్స్ లిమిటెడ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. మరోవైపు నాటి పాలకులు వేలాది ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మేశారు. దీనికి తోడు ఫ్యాక్టరీని 2002లో జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేటీకరించడంతో భూముల రక్షణకు సరైన యంత్రాంగం లేకుండా పోయింది. దీంతో ఫ్యాక్టరీకి చెందిన భూములు ఆక్రమణకు గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాం షుగర్స్ భూముల ఆక్రమణకు కళ్లెం పడింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తూనే.. మరో పక్క భూముల హద్దులను గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు వాటి చుట్టూ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం ఫ్యాక్టరీకి 16,395 ఎకరాల భూములు ఉండగా అప్పటి సీమాంధ్ర పాలకులు 5 వేల ఎకరాలను విడుతలవారీగా వేలం ద్వారా అమ్మివేశారు. కాగా, మిగిలిన భూముల్లో మరో ఆరు వేల ఎకరాలను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు, ఇండ్ల స్థలాల కోసం ఇచ్చారు. కొంత భూమిని వివిధ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇవన్నీ పోనూ ఇప్పుడు 428 ఎకరాల భూమి మాత్రమే నిజాం షుగర్స్కు మిగిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఏమైనా భూములు ఆక్రమణలో ఉన్నాయా అనే విషయాన్ని తేల్చేందుకు సర్వేను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్రమణదారులపై కొరడా ఝళిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
బోధన్, నవంబర్ 22 : బోధన్ డివిజన్లోని వివిధ ప్రాంతా ల్లో విస్తరించి ఉన్న నిజాం షుగర్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) భూములను పరిరక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజాం షుగర్స్కు సంబంధించిన భూములు చాలా ఏండ్లుగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్లక్ష్యంతో నిజాంషుగర్స్కు చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అమ్మివేసిన భూములతో పాటు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు, ఫ్యాక్టరీ కార్మికులు, వివిధ సంస్థలకు ఇచ్చిన భూములు పోను మిగిలిన భూముల్లో చాలా భాగం గత పాలకుల హయాంలో ఆక్రమణకు గురయ్యాయి.
నాటి పాలకులు ఈ భూములను వేలం ద్వారా అమ్మివేయడంతో.. ప్రస్తుతం సామాజిక అవసరాల కోసం భూమి దొరకని పరిస్థితి ఏర్పడింది. నిజాం షుగర్స్ను 2002లో జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేటీకరణ చేయడంతో.. భూముల రక్షణ కోసం ఫ్యాక్టరీకి సరైన యంత్రాంగం లేని పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. ఇదే అలుసుగా.. ఫ్యాక్టరీకి చెందిన భూములను కొంతమంది ఆక్రమించుకోవడం ప్రారంభించారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాం షుగర్స్ భూముల ఆక్రమణకు కళ్లెం పడింది. న్యాయపరమైన చిక్కులను ఒకపక్క పరిష్కరిస్తూనే.. మరో పక్క భూముల హద్దులను గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు వాటి చుట్టూ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.
ఒకప్పుడు నిజాం షుగర్స్కు 16,395 ఎకరాలు
1938లో బోధన్ పట్టణంలో స్థాపించిన నిజాం షుగర్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) యాజమాన్యం శక్కర్నగర్ కాలనీని ఏర్పాటు చేయడంతో పాటు సొంతంగా చెరుకు పంటను పండించడం కోసం బోధన్ చుట్టుపక్కల 30 కిలో మీటర్ల పరిధిలో వ్యవసాయ భూములను సమకూర్చుకున్నది. నిజాం షుగర్స్ ప్లాంటేషన్ విభాగం ఆధ్వర్యంలో ఈ భూములు ఉండేవి. అక్కడ ప్లాంటేషన్ విభాగం ఆధ్వర్యంలో పండిన చెరుకు పంటను లైట్ రైల్వే సిస్టమ్ ద్వారా, రోడ్డు మార్గాన ఫ్యాక్టరీకి చేరవేసేవారు.
ఈ చెరుకు పండే ప్రాంతాలను ‘ఫారాలు’ అని పిలిచేవారు.. బోధన్ మండలంలో ఊట్పల్లి, బెల్లాల్, పాండు, నర్సాపూర్, పెంటాకలాన్, సంగం, రెంజల్ మండలంలో రెంజల్, సాటాపూర్, బోర్గాం, ఎడపల్లి మండలం వడ్డేపల్లి, ఏఆర్పీ క్యాంప్, కోటగిరి మండలంలోని జల్లపల్లి, ఎక్లాస్పూర్, హంగర్గా, శక్కర్నగర్ పేరిట మొత్తం 15 ఫారాలు ఉండేవి. ప్లాంటేషన్ విభాగం మూసివేత తర్వాత ఈ ఫారాల భూముల రక్షణ కోసం అప్పటి పాలకులు సరైన చర్యలు తీసుకోలేదు.. అప్పటి సీమాంధ్ర పాలకులు 5 వేల ఎకరాలను విడుతలవారిగా వేలం పాటల్లో అమ్మివేశారు.
ఇలా అమ్మిన భూములు చాలా విలువైనవి.. భవిష్యత్తు అవసరాల కోసం కీలకమైన ప్రాంతాల్లో ఉన్న భూములను పరిరక్షించుకుండా, వేలం పాటల్లో అమ్మివేయడం గమనార్హం. కాగా, మిగిలిన భూముల్లో మరో ఆరు వేల ఎకరాలను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు, ఇండ్ల స్థలాల కోసం ఇచ్చారు. కొంత భూమిని వివిధ సంస్థలు కొనుగోలు చేశాయి. కాగా, చెరువుల విస్తరణ, రహదారులు, వాగులు, వంకల కింద మరికొంత భూమి ఉంటుందని చెబుతున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న బిట్లుగా ఉన్న ఎన్ఎస్ఎస్ భూములు ఆక్రమణకు గురయ్యాయి.
ఇక మిగిలింది 428 ఎకరాలు మాత్రమే..
అమ్మివేసిన భూములు, వివిధ కార్పొరేషన్లకు, వివిధ సంస్థలకు ఇచ్చిన భూములే కాకండా ఎప్పుడో ఆక్రమణలకు గురైన భూములు పోను.. ఇప్పుడు కేవలం 428 ఎకరాల భూమి మాత్రమే నిజాం షుగర్స్కు మిగిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అనేక చోట్ల ఉన్న భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో కూడా అంతుపట్టని పరిస్థితి ఉంది. ఈ భూముల లెక్క తేల్చేందుకు మూడేండ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇప్పటివరకు జరిగిన సర్వేలో 428 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు తేల్చారు.. ఇంకా ఏమైనా భూములు ఆక్రమణలో ఉన్నాయా అన్న విషయాన్ని తేల్చేందుకు సర్వేను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్రమణదారులపై కొరడా ఝళిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
68 ఎకరాల భూమికి కంచెల ఏర్పాటు:
నిజాంషుగర్స్ భూములను రక్షించేందుకు ఆ భూముల చుట్టూ కంచెలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 428 ఎకరాల్లో 216.08 ఎకరాలను భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు కేటాయించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ఇప్పటికే ఆ భూములను ఆక్రమించుకున్న అనర్హులను గుర్తించి వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆక్రమణల్లో అర్హులు ఉన్నట్లయితే.. వారి పేరిట పట్టాలు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, ఊట్పల్లి గ్రామానికి చెందిన మైనార్టీలు, బీసీల కబ్జాల్లో 60 ఎకరాల భూమి ఉంది. నిజాం షుగర్స్ భూముల కొనుగోళ్లు, కేటాయింపులతో స్థలాల విభజన జరగడంతో చిన్న చిన్న కమతాలుగా అక్కడక్కడ 83.39 ఎకరాలు ఉంటుందని సర్వేలో గుర్తించారు.
కాగా, 68 ఎకరాల భూమి మూడు పెద్ద కమతాలుగా ఉన్నాయి. ఈ మూడు కమతాల్లో 52 ఎకరాల బిట్కు, మరోచోట 8 ఎకరాల బిట్కు కంచెలు వేశారు. మరో 5 ఎకరాల బిట్కు త్వరలో కంచె వేయనున్నారు. ఈ భూముల ఆక్రమణలకు కొందరు చేసిన ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు తిప్పికొట్టారు. ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్లు ఏర్పాటుచేస్తుండడంతో మిగిలిన నిజాం షుగర్స్ భూములకు రక్షణ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ కింద ఈ భూములు ఉన్నాయి.
భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు
నిజాం షుగర్స్ భూములతో పాటు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా.. వాటి రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. నిజాం షుగర్స్ భూములను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తున్నాం. ఇటీవల ఒక చోట మేము వేసిన ఫెన్సింగ్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై పోలీసు కేసు నమోదు చేయించాం. ప్రభుత్వ చర్యలకు అడ్డువస్తే.. పీడీ యాక్ట్ ప్రయోగించాల్సి వస్తుందని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. న్యాయపరంగా వస్తున్న చిక్కులను పరిష్కరించుకుంటూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
– సోమ రాజేశ్వర్, రెవెన్యూ డివిజనల్ అధికారి, బోధన్