NCD kits | పని, ఇతర ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు చిన్నవయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నారు. ఇందులో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ మందులు వాడాల్సిందే. మందులు కొనడం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. బీపీ, షుగర్ రోగులకు ఉచితంగా మెడికల్ కిట్లను అందజేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు ఊరట లభించింది.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు దవాఖాలను బలోపేతం చేసి మెరుగైన సేవలను అందిస్తున్నది. ఏరియా దవాఖానలతోపాటు పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స, మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ వైద్యంపై భరోసా కలుగడంతో సర్కారు దవాఖానల్లో రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది. రోజురోజుకూ రోగాల బారినపడే బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత చేరువ చేస్తున్నది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి అవసరమయ్యే మందులను ఇంటికే వెళ్లి ఉచితంగా అందిస్తున్నది. పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది.
85,587 మందికి లబ్ధి..
బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడేవారు వైద్యులు సూచించిన మందులు ప్రతిరోజూ తీసుకుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరికీ కనీసం నెలకు రూ.500 నుంచి వెయ్యి రూపాయల దాకా ఖర్చవుతున్నది. ఒకే కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరిగినా కొద్దీ ఈ ఖర్చు భారంగా మారుతున్నది. ప్రభుత్వమే ఎన్సీడీ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 85,587 మంది షుగర్, బీపీతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 53,635 మంది బీపీ, 31,952 మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్సీడీ కిట్ల ద్వారా 85,587 మందికి లబ్ధి చేకూరుతున్నది.
ఇంటికే మందులు..
ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను అందిస్తున్నది. బీపీ, షుగర్ పేషంట్లకు నెలకు సరిపడా మందులను నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్ల రూపంలో అందిస్తున్నది. ముందుగా 80 ఏండ్లు పైబడిన బీపీ, షుగర్ పేషెంట్లకు ఆశ వర్కర్ల ద్వారా డోర్ డెలివరీ చేసింది. ఇప్పుడు 30 ఏండ్ల వయస్సు వారికి కూడా సబ్ సెంటర్ల ద్వారా మందులను పంపిణీ చేస్తున్నది. దీంతోపాటు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బీపీ, షుగర్ మందులే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉచితంగా చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
గ్రామస్థాయిలో సర్వే..
పేదలకు మేలు కలిగేలా ఎన్సీడీ కిట్ల పంపిణీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సబ్ సెంటర్ పరిధిలో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి టెస్టులు కూడా చేస్తున్నారు. ఇందుకోసం అధికారులు గ్రామస్థాయి నుంచి సర్వే చేస్తున్నారు. బీపీ, షుగర్ పరీక్షలతోపాటు క్యాన్సర్ లక్షణాలపై కూడా వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేకు సంబంధించిన డేటాషీట్ను ఎప్పటికప్పుడు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు అందజేస్తారు. దీంతోపాటు సబ్ సెంటర్లకు వచ్చేవారి ఆరోగ్యం వివరాలను కూడా అడిగి తెలుసుకుంటారు. ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యాధికారికి సమాచారం అందజేస్తారు.
నడి వయస్సు వారికి..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 10లక్షల 50వేల జనాభా ఉన్నది. ఇందులో 30 ఏండ్లు పైబడిన వారు 4లక్షల 82వే 887 మంది ఉన్నారు. వీరికి మొత్తం 179 సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలను అందిస్తున్నారు. నడి వయస్సు వారిలోనూ బీపీ, షుగర్ సమస్యలు అధికమవ్వడంతో సబ్ సెంటర్ల ద్వారా మందులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వైద్యులు సూచించిన డోసు ప్రకారం విడివిడిగా మందుల కిట్లను అందించనున్నారు. సర్కార్ నిర్ణయంతో నెలవారీగా మందుల కోసం ఖర్చు చేసే బాధ తప్పనున్నది.
ఎన్సీడీ కిట్లు అందజేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం, వైద్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని దీర్ఘకాలిక రోగులకు ఎన్సీడీ కిట్లను పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 88,587 మందికి లబ్ధి చేకూరుతున్నది. ప్రతి సబ్సెంటర్ నుంచి ఆశ కార్యకర్తలతో వారి పరిధిలో ఉన్న రోగులకు మందులు ఇవ్వడంతోపాటు అవగాహన కూడా కల్పిస్తున్నారు.
–డాక్టర్ లక్ష్మణ్సింగ్, డీఎంహెచ్వో, కామారెడ్డి