తెలంగాణ తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం స్వామి వారికి విశేష సేవలు నిర్వహించారు. భక్తుల జేజేల నడుమ బ్రహ్మాండ నాయకుడు హనుమంత, హంస వాహనాలపై ఊరేగారు. నేడు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
కొనసాగుతున్న తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాలు
బీర్కూర్, ఫిబ్రవరి 28: తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ సమీపంలోని వెంకన్నకొండ భక్తులతో కిటకిటలాడుతున్నది. మూడో రోజు మంగళవారం ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జియర్ స్వామి తీర్థగోష్టి, శాంతిపాఠం, ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, నిత్యహవనము, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
రాముని అవతారంలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు మంగళవారం ఉదయం రాముడి అవతారంలో తన పరమభక్తుడైన హనుమంత వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనంపై తెలంగాణ తిరుమల మాఢవీధుల్లో విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సోదరుడు శంభురెడ్డి దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9గంటల వరకు శ్రీవిష్ణు సహస్ర నామపారాయణం, ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, నిత్యహవనము, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై స్వామివారు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..
బాన్సువాడ / బీర్కూర్, ఫిబ్రవరి 28: తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యక్తిగత రక్షణ బృందం, డాగ్స్కాడ్ గుట్టపై తనిఖీలు చేపట్టారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో పోలీసు సిబ్బంది కూంబింగ్ చేశారు.
సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయులు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, సోదరుడు శంభురెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవంతోపాటు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభ, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం రాక నేపథ్యంలో భద్రతా సిబ్బంది కోసం ఆలయ ప్రాంగణంలోని అతిథిగృహంలో వసతి కల్పించారు. సుమారు 1100 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు బాన్సువాడ పట్టణ సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, రామగుండం తదితర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.