నేటి సమాజంలో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఎవరికి వారే తమ వృత్తులను కొనసాగిస్తున్నారు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత మానవ విలువలకు, దైవిక సంబంధాలకు తక్కువయ్యాయనే చెప్పవచ్చు. కానీ, ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠం వంశజులు, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీరామదాసి సురేశ్ ఆత్మారాం చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామమఠం వందల ఏండ్ల క్రితం సమర్ధరామదాసు స్వామీజీ చేతుల మీదుగా ఏర్పాటు చేశారని ప్రాశస్త్యంలో ఉన్నది. కాగా, ఈ మఠాన్ని పట్టించుకునే వారు లేక, పలువర్గాల కలహాలతో 20 ఏండ్ల క్రితం రామదాసి కుటుంబీకులు గ్రామానికి దూరంగా వెళ్లారు. వారిలో ఒకరైన శ్రీ సురేశ్ ఆత్మారాం మహరాజ్ మఠం జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తుల సహకారం కోరుతూ తాను ఉంటున్న చిలుకూరు, హైదరాబాద్లోని భక్తబృందం, దాతల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. నాటి నుంచి ఎడపల్లి మండల కేంద్రంలో శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కొనసాగుతున్నాయి.
ఎడపల్లి గ్రామానికి దూరంగా వెళ్లిన రామదాసి రాజారాం మహరాజ్ కుమారుల్లో ఒకరైన శ్రీరామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్ మొదటగా ఎడపల్లి శ్రీరామ మఠం జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన శ్రీరామ మఠాన్ని నూతనంగా నిర్మించి కార్యక్రమాలు పునఃప్రారంభించారు. ఈ దేవాలయమే కాకుండా పలు శిథిలావస్థకు చేరిన దేవాలయాలను పునర్నిర్మించారు. బోధన్- నిజామాబాద్ రహదారి పక్కన అంబం, నర్సాపూర్ గ్రామాల మధ్య ఓ చెట్టు కింద శిథిలావస్థలో ఉన్న హనుమాన్ మందిరాన్ని చూసిన ఆయన.. ఆలయ నిర్మాణానికి నడుంబిగించారు. 13ఏండ్ల క్రితం ఈ ప్రాంతంలో సుమారు రూ.25లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. రామమందిరం, నర్సాపూర్ హనుమాన్ మందిరాల్లో పూజా కార్యక్రమాలకు అర్చకులను నియమించారు. ఇటీవలే బోధన్ పట్టణం శక్కర్నగర్లో నిజాం చక్కెర కర్మాగారం కొనసాగే కాలంలో భక్తులు, అధికారుల సహకారంతో గ్రామ దేవతలతో కూడిన త్రిశక్తి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేనా ఆలయం శిథిలావస్థకు చేరడంతో కాలనీకి చెందిన కొందరు తమ ఆలయ జీర్ణోద్ధరణకు సురేశ్ ఆత్మారాం మహరాజ్ను సంప్రదించారు. ఈ విషయంపై స్పందించిన ఆయన ఆలయాన్ని పునర్నిర్మించారు. నాలుగు నెలల క్రితం ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఆయనే స్వయంగా నిర్వహించారు. పలు పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సురేశ్ ఆత్మారాం మహరాజ్ అందించిన సేవలు విశిష్టమైనవని పలువురు అభినందిస్తున్నారు.