సదాశివనగర్, సెప్టెంబర్ 6: పున్నమి వెన్నెల్లో ధగధగా మెరిసిపోయే ఆ ఆలయాన్ని దర్శించడం ఓ మధురానుభూతి. గుట్టపై వెలిసిన శ్రీ కృష్ణ పరమాత్ముడి సన్నిధిలో విహరించిన ప్రతి ఒక్కరూ తీపిజ్ఞాపకాలు సొంతం చేసుకుంటారు. ఆలయ నిర్వాహకులు చేసే అన్నప్రసాదం మధురాతి మధురం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులోని శ్రీ కృష్ణ మందిరం కాలక్రమేనా అభివృద్ధి చెందుతున్నది. భక్తుల కొంగు బంగారమై జాలిదేవుడి గుట్టగా ప్రసిద్ధి చెందినదీ ఆలయం. సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన శ్రీ కృష్ణ మందిరం ఆధ్యాత్మక కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా ఆదరణ పొందుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన పలువురు భక్తుల దాతృత్వంలో ఈ ఆలయం అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్నది.
1966లో వెలసిన ఆలయం
1966వ సంవత్సరంలో గ్రామ శివారులోని గుట్టపై ఈ మందిరాన్ని తొలుత చిన్న గుడిసెలో ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణుడు వెలసిన ఈ గుట్టకు ‘జాలి దేవుని గుట్ట’గా నామకరణం చేశారు. అనంతరం 1971వ సంవత్సరంలో గుట్టపై గ్రామస్తులు చిన్న గుడి నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ గుట్టపై ఉత్సవాలు, జాతర తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నారు.
ఆలయ నిర్మాణానికి గ్రామస్తుల కృషి..
ఈ మందిర నిర్వహణ బాధ్యతను కన్నెరాజ్ బాబా (మాచాలే బాబా) తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతున్నది. 2011 ఏప్రిల్లో నూతన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయానికి గ్రామస్తులు 10 ఎకరాల భూమిని కేటాయించగా, ఆలయానికి దక్షిణ దిశలో రూ.20 లక్షలతో భోజనశాల, ఆశ్రమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఉపదేశం స్వీకరించే దంపతులు
గ్రామంలోని ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు స్వామి వారి ఉపదేశం స్వీకరిస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం స్వామి వారి జపం చేసిన తర్వాతే అన్నపానీయాలు స్వీకరించే అలవాటును లింగంపల్లి గ్రామంలో మొదలుపెట్టారు. ఇప్పుడు గ్రామస్తులంతా శ్రీ కృష్ణ భక్తులుగా మారి సన్మార్గంలో నడుస్తున్నారు.
శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు..
ఈనెల 6వ తేదీ రాత్రి నుంచి 7వ తేదీ తెల్లవారుజామున శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, ఒక్క పొద్దులు, మధ్యాహ్నం గోపాల కల్వలు, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయంలో బాబాలతో సామూహిక గీతా పఠనం ఉంటుంది.
ఆధ్యాత్మిక బోధనే మా కర్తవ్యం..
లింగంపల్లి ఊరి చివర గుట్టమీద గుడిసె వేసి శ్రీష్ణ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేసేవాళ్లం. అప్పటి నుంచి గ్రామస్తులందరికీ శ్రీకృష్ణ ఆశీర్వాదంతో ఉపదేశం చేశాం. 2011లో దాతల సహాయంతో గుడిని నిర్మించాం. ప్రజల్లో ఆధ్యాత్మికత పెంచడమే మా కర్తవ్యం.
– మహంత్ శ్రీ మచాలేబాబా, శ్రీకృష్ణమందిర పీఠాధిపతి, లింగంపల్లి
30ఏండ్ల నుంచి ఉపదేశం తీసుకున్నా..
శ్రీకృష్ణ మందిరం ఏర్పడినప్పుడే మా కుటుంబ సభ్యులందరం ఉపదేశం తీసుకున్నాం. ఇప్పటికీ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తాం. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా శుభ్రంగా ఉంటాం. మాకు మేలు జరుగుతున్నది.
– పెద్దబీర చందర్రావు, మాజీ సర్పంచ్, లింగంపల్లి