నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 17 : పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సంస్థలో అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి కోసం ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న నిందితుడి ఆచూకీ తెలియజేసిన వారికి పారితోషకం అందజేస్తామని నోటీసులో పేర్కొన్నారు. నగరంలోని మాలపల్లికి చెందిన ఎంఏ ఆహాద్ అలియాస్ ఎండీ అబ్దుల్ పేరు మోస్ట్ వాంటెడ్గా ఎన్ఐఏ ప్రకటించింది. నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ కార్యకలాపాలు వ్యాప్తిచేస్తూ, యువతను రెచ్చగొడుతూ, సంఘ విద్రోహక కార్యకలాపాలకు ఆజ్యంపోసిన ఎంఏ ఆహాద్ గతంలో పీఎఫ్ఐ రాష్ట్ర నాయకుడిగా వ్యవహరించారు. చాపకింద నీరులా ఉగ్ర కార్యకలాపాలను జిల్లాలో విస్తరించిన సదరు నిందితుడిపై 2022 జూలై 4న నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఉగ్ర కార్యకలపాలను విస్తరించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఎంఏ ఆహాద్ కోసం గతేడా ది జూలై నుంచి తెలంగాణ పోలీసులతోపాటు ఎన్ఐఏ బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పీఎఫ్ఐ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి, ఎంతో మంది యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు చట్టవ్యతిరేక కార్యకలపాల్లో ముందుండి నడిపించిన ఆహాద్ కోసం ఎన్ఐఏ బృందం ప్రత్యేక టీమ్ను సైతం ఏర్పాటు చేశారు. ఆ టీమ్ తరచూ జిల్లాకు వచ్చి ఆరో టౌన్ పరిధిలో నిందితుడి నివాసంతో పాటు చట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
ఎన్ఐఏ సంస్థ జారీ చేసిన మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న నిజామాబాద్ నగరానికి చెందిన నిందితుడు ఆహాద్ ఆచూకీ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ స్పెషల్ టీమును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిందితుడు ఉన్న ఏరియాతో పాటు సంబంధీకులపై నిఘా పెట్టి ఉంచాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.