ఖలీల్వాడి, మే 23: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ట్రాన్స్జెండర్లకు ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జీజీహెచ్లో గురువారం ఓపీ సేవలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ట్రాన్స్జెండర్లు ఆరోగ్య సమస్యలను ఏ దవాఖానలో చూపించుకోవాలో తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి కోసమే ఈ ఓపీ సెంటర్ను ప్రారంభించారన్నారు. జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ సంవత్సరంపాటు ఈ క్లినిక్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, ఆమె కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ట్రాన్స్జెండర్లు, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ఓపీ వైద్య సేవలందుతాయన్నారు. ఈ ఓపీ సేవలు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అమెరికా, వైజీఆర్ సంరక్షణ, డీఎస్ఎల్ఏ సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు, ట్రెయినీ ఐపీఎస్ శేషాద్రిరెడ్డి, స్నేహ, టీఐ ప్రాజెక్టు స్టాఫ్, ట్రాన్స్జెండర్లు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.