బాన్సువాడ, సెప్టెంబర్ 22 : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు కోట్లు కొల్లగొట్టారని, ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే రూ.270 కోట్లు దోచుకున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారు మళ్లీ గ్రామాలకు వస్తున్నారని, అవినీతి నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీర్కూర్ మండలంలోని సాంబాపూర్, బైరాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను స్పీకర్ శుక్రవారం ప్రారంభించారు.
ప్రజలకు మంచి చేసే నాయకులు, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని బైరాపూర్, సాంబాపూర్ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. బైరాపూర్ లో 42, సాంబాపూర్లో 25 డబుల్ బెడ్ రూం ఇండ్లతోపాటు పలు అభివృద్ధి పనులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజక వర్గంలో 24 గంటలు ప్రజల శ్రేయస్సు కోరి, వారి మంచి చెడుల్లో పాలు పంచుకునే వ్యక్తులను ఎన్నుకుంటారో లేదా అవినీతికి పాల్పడి, దోచుకున్న సొమ్ముతో ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చిన వారిని ఆదరిస్తారో ఆలోచించుకోవాలని కోరారు. మంచి చేసే వ్యక్తులను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి
కాంగ్రెస్ పార్టీ హయాంలో బాన్సువాడ నియోజక వర్గానికి 24 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాగా..ఆయా గ్రామాల పేరిట ఇండ్లను నిర్మించినట్లు రికార్డుల్లో చూపించారని మండిపడ్డారు. బడా నాయకులు పేదల పేర్లను రాసి వారి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. చివరికి పేదలకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విచారణ జరిపితే కొంతమంది అధికారులు ఉద్యోగాలు కోల్పోయారని, కొంతమంది నాయకులు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో ప్రతిపేద వాడికి సొంతిల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరుకాగా నిర్మించి అబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ధనవంతుడైనా, పేదవాడైనా జీవితంలో ప్రతి ఒక్కరికీ కావాల్సింది తోడు, నీడ అని పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలకతీతంగా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేసినట్లు చెప్పారు. కొంత మంది నాయకులు తనపై ఒత్తిడి తెచ్చినా అక్రమాలకు వత్తాసు పలుకలేదన్నారు. నియోజకవర్గంలో 2570 మంది గిరిజనులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా సొంతస్థలం ఉన్నవారు ఉంటే గృహలక్ష్మి పథకం కింద మంజూరుచేస్తామన్నారు. తెలంగాణ వచ్చాక అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చినట్లు తెలిపారు. ఎక్కడైనా ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డుల్లో ఉందా అని ప్రశ్నించారు.
అవినీతి నాయకులను నిలదీయాలి
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే శక్తి సీఎం కేసీఆర్కు తప్ప ఎవరికీ లేదన్నారు. ప్రజల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. ప్రజలకు అవసరమైన మంచి పనులు చేయాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటే మరో వందేండ్లు వచ్చినా పేదరికం పోదన్నారు. అవినీతికి పాల్పడిన డబ్బులతో ఎన్నికల్లో ఓట్లు కొనడానికి నాయకులు వస్తారని, అలాంటి వారిని గట్టిగా నిలదీయాలని సూచించారు. మార్పు ప్రజల నుంచి రావాలన్నారు. పేదల తలరాత మార్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబును అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పీకర్ పోచారం వెల్లడించారు.