బాన్సువాడ టౌన్/బాన్సువాడ, మే 30: తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధికి సంబంధించిన వివరాలను గ్రామ కూడళ్ల వద్ద ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా విఫలమైనట్లే అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని జ్ఞానసరస్వతీ దేవాలయ కల్యాణమండపంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ, జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సంక్షేమం అంటే తెలంగాణ, తెలంగాణ అంటే సంక్షేమమని అన్నారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. జూన్ 2వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించడంతో దశాబ్ది ఉత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలు 22 వరకు కొనసాగుతాయని తెలిపారు. రోజుకో ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా నియోజకవర్గం పరిధిలో లబ్ధిపొందిన వివరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి తదితర అంశాలను వివరించాలన్నారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేస్తే సహించేదిలేదు..
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లల్లో భయం చూపిస్తూనే.. కడుపులో ప్రజలపై దయ చూపించాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఎంతటివారైనా సరే సహించేదిలేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మొక్కుబడిగా పనిచేస్తే అభివృద్ధి గంగపాలవుతుందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా సుమారు 30 ఏండ్లు ఉన్నానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత వెట్టిచాకిరి చేసినా ప్రయోజనం ఉండేదికాదన్నారు. నియోజక వర్గానికి ఏదైనా మంచి చేయాలని, ప్రజల కష్టాలను తీర్చాలని రోజులు, నెలల తరబడి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి ప్రయోజనం ఉండేదికాదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక పరిస్థితి మారిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చానని, ఇందుకు పూర్తి సహకారం అందించి, నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
దమ్మున్న నాయకుడు కేసీఆర్
రైతు, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మొదటి వ్యక్తి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని సభాపతి అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో రైతును రాజుగా నిలబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గర్వంగా చెబుతున్నానని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను ప్రధాన ప్రచారకర్తలుగా పాలుపంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఇంటి పండుగలా దశాబ్ది ఉత్సవాలు: కలెక్టర్
దశాబ్ది ఉత్సవాలను ఒక కార్యక్రమంగా కాకుండా ఇంటి పండుగలా, శుభకార్యంగా ప్రతి ఒక్కరూ భావించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు.ఉత్సవాలు ముగిసే వరకూ ఏ ఒక్క అధికారి అత్యవసర పరిస్థితి వస్తే తప్ప సెలవులో ఉండరాదని ఆదేశించారు. సమావేశంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్వోలు నిఖిత, వికాస్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఉమ్మడి జిల్లాల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, బాన్సువాడ ఏరియా దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్ నాయక్, బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.