బాన్సువాడ రూరల్, నవంబర్ 11 : కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన అంగ్ల విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నా రు. మండలంలోని బోర్లం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ విద్యా దినోత్సవం(దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి)లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ గల గొప్ప వ్యక్తుల్లో మౌలానా అబుల్ కలాం ఒకరని అన్నారు. కష్టపడి పైకి వచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం ఐదు మైనార్టీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం సాధించాక 206కు చేరుకున్నాయని తెలిపారు. దూర దృష్టితో బడుగు, బలహీన వర్గాల ప్రజల బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఉపాధ్యాయులు ప్రత్యే క శ్రద్ధ తీసుకొని విద్యార్థులను తమ పిల్లలుగా భావించి నాణ్యమైన బోధన అందించాలని కోరారు. బాన్సువాడ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు డిగ్రీ కళాశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాలతో పాటు బీసీ, మైనార్టీ, ఎస్సీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు, యోగాసనాలు ఆకట్టుకున్నాయి. పదో తరగతి తో పాటు ఇంటర్ టాపర్గా నిలిచిన విద్యార్థులకు స్పీకర్ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీలత, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, సర్పంచ్ సరళ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మజీద్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బాన్సువాడ సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల డైరెక్టర్ దేవేందర్రెడ్డి, నాయకులు మహ్మద్ ఎజాస్, వాహబ్, జలీల్, నాగభూషణం, సయ్యద్ జలీల్, మెహబూబ్, హైమద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.