బాన్సువాడ టౌన్/బాన్సువాడ రూరల్, ఆగస్టు 19 : గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని.. దీంతో పూర్తిస్థాయి సేవలు అందకపోయేవని. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేరేందుకు వీలుగా గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం నియమించిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించిన ఏకైక రాష్ట్రం మనదేనని.. మరే ఇతర రాష్ర్టాల్లో ఇలాంటి నియామకాలు జరగలేదని స్పీకర్ స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న 59 మంది కి గ్రేడ్-4 కార్యదర్శులుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాపీలను శనివారం పట్టణంలోని తన నివాసంలో అందజేశారు. శాశ్వత ఉద్యోగులుగా బాధ్యతలు చేపడుతున్న అందరికీ స్పీకర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ డీపీవో జయసుధా, కామారెడ్డి డీఎల్పీవో శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ శ్రీమతి దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, బాన్సువాడ ఎంపీడీవో సత్యనారాయణ, బీర్కూర్ ఎంపీపీ రఘు, నస్రుల్లాబాద్ ఎంపీపీ పాల్థ్యా విఠల్, స్థానిక నాయకులు గోపాల్ రెడ్డి, బాన్సువాడ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో దాత సహకారంతో నిర్మించిన మసీదును ఆయన మత పెద్దలతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని, ప్రతీ ఒక్కరి మతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అడగకుండానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు సుపరిపాలన అందించే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని స్పీకర్ పోచారం కోరారు. ప్రజల మధ్య మతాలు, కులాల పేరుతో చిచ్చుపెట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల న్నా రు. కర్ణాటక రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పు డు పథకాలకు కొర్రీలు పెడుతుందన్నారు. పండ్లు న్న చెట్టును కాపాడుకోవాలని, ముండ్లు ఉన్న చెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్, బీజేపీలను ఉద్ధేశిస్తూ అన్నారు. తన సొంత డబ్బులతో మసీదును నిర్మించిన దాత మౌలానా అబ్రాజ్ను స్పీకర్ అభినందించారు. మసీదు ప్రహరీ నిర్మాణానికి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, అజ్మత్, అమేర్, ఖలీం, ఘనీ, బుడ్మి సొసైటీ అధ్యక్షుడు గంగుల గంగారాం, నాయకులు భూషణ్రెడ్డి, మోహన్నాయక్, దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్రెడ్డి, పాత బాలకృష్ణ, కుమ్మరి రాజు, లక్ష్మాగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.