కామారెడ్డి, ఏప్రిల్ 11 : రాష్ట్రంలోని అన్ని మతాల ను బీఆర్ఎస్ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తున్నది. ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆయా పండుగలకు దుస్తులను పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా పవిత్ర రంజాన్ సందర్భంగా ఏటా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించి బట్టలతోపాటు ఇతర సామగ్రిని కానుకగా అందిస్తున్నది. అధికారికంగా ఇప్తార్ విందులను సైతం ఏర్పాటు చేస్తున్నది. బతుకమ్మ పండుగకు చీరలు, క్రిస్మస్, రంజాన్ పర్వదినాల్లో దుస్తులు అందజేస్తున్నది.
కామారెడ్డి జిల్లాకు రంజాన్ తోఫాలు..
రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో పంపిణీ చేసేందుకు గిఫ్ట్ ప్యాక్లు చేరుకున్నాయి. మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 9వేల మందిని అర్హులుగా గుర్తించి తోఫాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మసీదు కమిటీలకు పంపిణీ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు గిఫ్ట్ ప్యాక్లను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతోపాటు ఇఫ్తార్ విందు కోసం రూ. 18 లక్షలు అందజేయనున్నది. త్వరలోనే ఆయా మండలాల తహసీల్దార్లకు వీటిని అందజేసి ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
9వేల మందికి లబ్ధి..
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు ఉండగా, మొత్తం 9 వేల మందికి రంజాన్ తోఫాలను పంపిణీ చేయనున్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ కానుకలను అందజేస్తున్నారు. ప్రతి మసీదుకు 500 గిఫ్ట్ ప్యాక్లను అందజేయనున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఐదు మసీదులు ఉండగా, 2500 తోఫాలు, బాన్సువాడ నియోజక వర్గానికి 2500, జుక్కల్కు 2500, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1500 గిఫ్ట్ ప్యాక్లను అందజేయనున్నారు. మొత్తం 9 వేల మందికి తోఫాలతోపాటు ఇఫ్తార్ విందు కోసం 5 మసీదులకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 18 లక్షలు ఇవ్వనున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్లో డ్రెస్ మెటీరియల్, చీర, కుర్తా, పైజామాకు సంబంధించిన దుస్తులు ఉన్నాయి. స్థానిక మసీదు కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి తహసీల్దార్లకు వివరాలు అందిస్తారు. ఆ తర్వాత తోఫాలను పంపిణీ చేయనున్నారు.
త్వరలోనే పంపిణీ చేస్తాం..
రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు గిఫ్ట్ ప్యాక్లను సరఫరా చేసింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 9 వేల మందికి వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. తోఫాల పంపిణీ బాధ్యతలను తహసీల్దార్లు, మసీదు కమిటీలకు అప్పగించాం.
– దయానంద్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ
ఇన్చార్జి అధికారి, కామారెడ్డి