telangana university | భిక్కనూరు ఏప్రిల్ 10 : హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నందు విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై, జీవో నెంబర్ 21 తోపాటు తమ సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన కాంట్రాక్ట్ అద్యాపకులను అరెస్టుకు నిరసనగా తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో (సౌత్ క్యాంపస్) గురువారం బంద్ పాటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ కు విద్యార్థుల మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల కోఆర్డినేషన్ కమిటీ నాయకులు డాక్టర్ ఎస్ నారాయణ మాట్లాడుతూ తమను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించి ఆదుకుంటుందనుకుంటే తమను అరెస్టులను చేయించి, గృహనిర్బంధం చేయడం, మహిళా అధ్యాపకుల పట్ల దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర చరిత్రలో విశ్వవిద్యాలయాల అధ్యాపకులను అరెస్టు చేయడంపై ఈ రోజును చీకటి దినంగా భావిస్తున్నామన్నారు.
ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి బేసిక్ పే, హెచ్ ఆర్ ప్లస్ డి ఎ తో పాటు 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత 15 నుండి 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తమ సర్వస్వాన్ని అంకితం చేసామని, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రెగ్యులరైజేషన్ లేదా ఉద్యోగ భద్రతతో కూడిన సెవెంత్ పిఆర్సి ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్స్ డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నర్సయ్య, అసిస్టెంట్ పిఆర్ఓ డాక్టర్ సరిత, డాక్టర్ నిరంజన్, శ్రీకాంత్, దిలీప్, పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యాపకులు డాక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, పోతన్న, శ్రీకాంత్, కనకయ్య, కిషన్, సునీల్, విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.