జిల్లాలోని కొన్ని ఆధార్ నమోదు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. డబ్బు యావలో పడి తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నాయి. నిర్దేశిత రుసుం కన్నా ఎక్కువగా వసూలు చేస్తూ జనాన్ని దోచుకుంటున్నాయి. ఆధార్లో పేరు మార్పు, అక్షరాల్లో తప్పొప్పులు, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ సీడింగ్ వంటి వాటికి నిర్దిష్ట చార్జీల కన్నా పది రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీలను రంగంలోకి దింపింది. ఆధార్ కేంద్రాల్లో అవినీతిని రూపుమాపేందుకు కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్(రెవెన్యూ) కన్వీనర్గా ఆయా శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేరుస్తూ కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలు ఉండగా, కొత్తగా ఏర్పాటు కానున్ను జిల్లా స్థాయి కమిటీ ద్వారా అక్రమ వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆధార్ నమోదు కేంద్రాల్లో అక్రమ వసూళ్లు, నకిలీ ఆధార్ కార్డుల తయారీ జోరుగా సాగుతున్నాయి. నిరక్షరాస్యులే లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్న వారు కొందరైతే ..ఇంకొందరు కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. ఆధార్లో పేరు మార్పు, అక్షరాల్లో తప్పొప్పులు, చిరునామా సవరణ, మొబైల్ ఫోన్ నంబర్ సీడింగ్ వంటి వాటికి నిర్దిష్ట చార్జీల కన్నా పది రెట్ల దోపిడీ సాగుతున్నది.
ఆధార్ కేంద్రాల్లో లెక్కకు మించి జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సూచనలతో మరోసారి జీవోను జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆధార్ నమోదు కేంద్రాల్లో అవినీతిని రూపుమాపేందుకు ఏకంగా జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్(రెవెన్యూ) కన్వీనర్గా ఆయా శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేరుస్తూ పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ కేంద్రాల్లో జరిగే అక్రమాల తంతుకు చెక్ పడనున్నది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆధార్ సేవలపై ఫిర్యాదులకు ఉన్న టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదులు చేసే అవకాశం ఉండగా.. కొత్తగా జిల్లా స్థాయి కమిటీ ద్వారా వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట పడనున్నది.
దేశ వ్యాప్తంగా ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్, సవరణలు, వేలి ముద్రలు, ఐరిస్ వంటి మార్పులు, చేర్పులకు ఒకే రకమైన చార్జీలను యూఐడీఏఐ నిర్ణయించింది. కానీ ఇందుకు విరుద్ధంగా వసూళ్ల పర్వం మూడు పువ్వులు… ఆరు కాయలన్నట్లుగా సాగుతున్నది. చిన్న పిల్లలకు కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్కు పూర్తి ఉచితంగా చేయాలి. చంటి పిల్లల ఆధార్ కార్డు నమోదుకు సెంటర్లలో రూ.200 నుంచి రూ.500 వరకు వసూళ్లు చేస్తున్నారు. చిరునామా మార్పు, తప్పు ఒప్పుల సవరణకు రూ.వేలల్లో భారం వేస్తున్నారు. పింఛన్ల కోసం వచ్చే వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు దారుణంగా దోపిడీకి గురవుతున్నారు.
చిన్న పిల్లలకు తొలిసారి ఆధార్ నమోదు ఉచితంగా చేయాలి. బయోమెట్రిక్ అప్డేట్ సైతం పైసా తీసుకోకూడదు. రెండోసారి బయోమెట్రిక్ అప్ డేట్ చేస్తే రూ.100 తీసుకోవాలి. చిరునామా మార్పు చేస్తే రూ.50 రుసుము చెల్లించాలి. ఈ ఆధార్ డౌన్లోడ్ లేదా కలర్ ప్రింట్ తీసుకుంటే రూ.30 మాత్రమే చెల్లించాలి. ఇవేవి ఆధార్ కేంద్రాల్లో అమలు కావడం లేదు. ఎక్కడా రుసుములకు సంబంధించిన పట్టిక ప్రదర్శించిన దాఖలాలులేవు. పట్టిక ఏర్పాటు చేస్తే అక్రమంగా వసూలు చేసేందుకు వీలు పడదనే భావనతో నిర్వాహకులు ప్రదర్శించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో మండల కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మొత్తం 64 ఆధార్ సెంటర్లున్నాయి.
నకిలీ కార్డులను ఏరివేయడం, వసూళ్ల పర్వానికి తెర దించేందుకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆధార్ పర్యవేక్షణ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా అదనపు కలెక్టర్(రెవెన్యూ), మెంబర్లుగా పోలీస్ కమిషనర్ లేదా జిల్లా ఎస్పీ, ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పోస్టల్ శాఖ జిల్లా సూపరింటెండెంట్, యూఐడీఏఐ మేనేజర్, డీఈవో, డీడబ్ల్యూవో, డీఎంహెచ్వో తదితర శాఖల అధికారులను చేర్చారు.
ఆధార్ నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా అక్రమాలకు ఆస్కారం ఉండకుండా ఈ కమిటీ పర్యవేక్షణ చేయనున్నది. ప్రస్తుతం అన్ని రకాల సంక్షేమ పథకాలతో పాటు పాన్కార్డు, బ్యాంకు, పీఎఫ్ ఖాతాలకు, ఎస్సెస్సీ పరీక్షలకు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి, డ్రైవింగ్, లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లకు ఆధార్ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. వాటిలో ఉన్న అక్షర దోషాలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇక నిరక్షరాస్యులకు అవి తెలియకపోవడంతో వారు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల ఇబ్బందిని గ్రహిస్తోన్న ఆధార్ నిర్వాహకులు ఇష్టానుసారంగా సొమ్ము చేసుకుని పబ్బం గడుపుకొంటున్నారు.
ఆధార్ సమస్య రోజురోజుకూ తీవ్రం అవుతోంది. ప్రభుత్వ పథకాలకు, అవసరానికి దేనికైనా దరఖాస్తు చేస్తే ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్నారు. ఇందులో చిన్న చిన్న లోపాలను సవరించుకోవడానికి రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కేంద్రాలు ఉన్నా అవి మొక్కుబడిగా సాగుతున్నాయి.
ఉన్న వాటిల్లో రోజుకు 25 నుంచి 40 మందికి మాత్రమే అవకాశం కల్పించడంతో అత్యవసరం ఉన్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులు ఆధార్ నంబర్ అనుసంధానం చేసిన మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీతో టీ వ్యాలెట్ ద్వారా స్కాలర్ షిప్లు పొందాల్సి ఉంది. ఓటీపీ రాకపోయి,వేలి ముద్రలు సరిపోక పోయినా పొందే అవకాశం లేదు. దీంతో ఆధార్ కార్డును ప్రస్తుతం ఉన్న మొబైల్ ఫోన్కు తప్పనిసరిగా అనుసంధానం కోసం రూ.వేలల్లో ముట్టజెప్పాల్సి వస్తోంది.
సొంత ఇండ్లు లేని వారు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. వారంతా ఆధార్లో ఉన్న చిరునామాను నిరంతరం మార్చుకునే అవకాశం లేదు. ఒకరు మూడు సార్లు మాత్రమే సవరించుకోవచ్చు. 15 ఏండ్లు దాటిన విద్యార్థులు వేలి ముద్రలను తిరిగి దిద్దుబాటు చేసుకోవాల్సిన రావడం, తప్పుల సవరణ, మొబైల్ నంబర్ అనుసంధానానికి ఎక్కువగా వస్తుండడంతో కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. ఈ రద్దీని నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఆధార్ నమోదు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం నడుచుకోని వారిపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వస్తున్న ఫిర్యాదులపై పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ను చైర్మన్గా నియమిస్తూ కమిటీ ఏర్పాటైంది. బాధితులెవరైనా ఈ కమిటీ ద్వారా లేదంటే 1947, 1100 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
– కార్తీక్, నిజామాబాద్ ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్