ఏర్గట్ల, నవంబర్ 30 : అన్నదాతలు మంచి దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. వ్యవసాయాధికారులు ఇచ్చే భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులు మంచి పంటదిగుబడులు సాధిస్తారు. రాష్ట్రం ఏర్పాటు కాకమునుపు అన్నదాతలు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. భూమి సారవంతంగా ఉండాలంటే భూసార పరీక్షలు నిర్వహించాలి. కానీ గతంలో అన్నదాతలు భూసార పరీక్షల కోసం మండల వ్యవసాయాధికారులను సంప్రదిస్తే పరీక్షలు సకాలంలో చేసే వారు కారు. అతికష్టం మీద పరీక్షల నిమిత్తం పంట భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించి జిల్లా కేంద్రానికి పంపించేవారు.
ఫలితాలు రావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టేది. గతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం, బోధన్లో మాత్రమే భూసార పరీక్షా కేంద్రాలు ఉండేవి. దీంతో ఫలితాలు కోసం వెయ్యి కండ్లతో ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఫలితాలు రాకపోవడంతో రైతులు భూసారానికి తగిన విధంగా పంటలు వేయకపోవడం, మందులు వాడకపోవడంతో దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల బాగు గురించి ఆలోచించి మండలానికో వ్యవసాయాధికారిని నియమించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మినీ కిట్ ద్వారా 12 రకాల భూసార పరీక్షలు చేసి వెంటనే ఫలితాలను ఇస్తున్నారు. దీంతో భూసారానికి అనుగుణంగా రైతులు పంటలు వేసి అధిక దిగుబడిని సాధిస్తున్నారు. సీఎం కేసీఆర్ మండలానికి ఒక భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో రైతులకు దూర భారం తగ్గడంతో పాటు ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవస్థ లేకుండా పోయింది.
భూసార పరీక్షల కోసం రైతులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మట్టి నమూనాలను సేకరించి రైతులకు మా కార్యాలయంలోనే పరీక్ష చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో జిల్లా కేంద్రానికి పంపి వెంటనే ఫలితాలను తెప్పిస్తున్నాం. భూసార పరీక్షలతో భూములపై రైతులకు అవగాహన కలిగింది. మేమిచ్చే ఫలితాలతో రైతులు సంతోషంగా పంటలు వేసుకుంటున్నారు.
-అబ్దుల్ మాలిక్, మండల వ్యవసాయాధికారి, ఏర్గట్ల
తెలంగాణ రాకముందు భూసార పరీక్షల కోసం వ్యవసాధికారులకు మట్టి నమూనాలు ఇచ్చి ఫలితాల కోసం వేచి చూడాల్సి వస్తుండె. చాలాసార్లు పంటలు వేయకముందు భూసార పరీక్షల కోసం మట్టి నమునాలు ఇచ్చినా ఫలితాల్లో జాప్యం కావడంతో పంటలు కోతకు వచ్చే సమయంలో వచ్చేవి. దాంతో సరైన దిగుబడి రాకపోయేది. ఇప్పుడు మట్టి నమూనాలు ఇచ్చిన 15 రోజుల్లోనే భూసార పరీక్షల ఫలితాలు ఇస్తున్నారు. దీంతో భూమిని బట్టి పంటలు వేసుకుంటున్నాం. మంచి ఫలితాలు పొందుతున్నాం.
-అశిరెడ్డి శ్రీనివాస్, రైతు దోంచంద.