తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బోధన్ మండలం సాలూరా సమీపంలో మంజీరపై నిర్మిస్తున్న వంతెన పనుల్లో ‘మహా’ జాప్యం జరుగుతున్నది. అటు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించక పోవడం, ఇటు మహారాష్ట్ర సర్కారు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మంజీరా నదిపై ఉన్న రెండు బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరగా, కొత్త వంతెన నిర్మాణాన్ని ఏడాది క్రితం ప్రారంభించారు. పనుల్లో జాప్యంతో రెండు రాష్ర్టాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
-బోధన్, ఆగస్టు 26
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూరా సమీపంలో మంజీరా నదిపై ఉన్న పెద్ద వంతెనపై నుంచి వాహనాలు, జనం రాకపోకలు నిషేధించిన దరిమిలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వందేండ్ల నాటి పురాతన వంతెన పైనుంచి ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలకు ఆంక్షలకు లోబడి అనుమతి ఉన్నప్పటికీ, ఆ పురాతన వంతెన ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ వంతెన మీదుగా చిన్నచిన్న వాహనాలు, ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రయాణం సాగిస్తున్నాయి. ఇటీవల మంజీర వరదలకు రోజులతరబడి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో సరిహద్దులో పెద్ద, పాత వంతెనల మధ్యన కొత్త వంతెన నిర్మాణానికి మహారాష్ట్ర సర్కార్ పర్యవేక్షణలో ఏడాది కిందట పనులు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ పనుల్లో జాప్యంతో ఇరు రాష్ర్టాల మధ్య జరిగే వర్తక, వాణిజ్యాలకే కాకుండా, ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలోని ప్రజలకు సైతం కష్టాలు ఎదురవుతున్నాయి. కొత్త వంతెన నిర్మాణంలో అంతులేని జాప్యాన్ని చూస్తుంటే.. ఇంకా ఎన్నేండ్లు పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కొత్త వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని వర్తక, వ్యాపారులతోపాటు సరిహద్దు గ్రామాల ప్రజలు మహారాష్ట్ర సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు.
పురాతన వంతెన, పెద్ద వంతెన.. రెండూ శిథిలావస్థలో..
మంజీరపై వందేండ్ల కిందట నిజాం కాలంలో వంతెన నిర్మాణం జరిగింది. ఇది పూర్తి రాతి కట్టడం. ఈ వంతెన ఇప్పటికీ సేవలను అందిస్తుండడం విశేషం. ఈ వంతెన ఎత్తు తక్కువగా ఉండడంతో మంజీరకు వరదలు వచ్చినప్పుడల్లా నీట మునిగేది. దీంతో మంజీరా నదిపై పెద్ద వంతెన నిర్మాణానికి 1983-84లో సంకల్పించారు. మహారాష్ట్ర సర్కార్ పర్యవేక్షణలో జరిగిన ఈ వంతెన నిర్మాణానికి కొంతమొత్తం వ్యయాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించింది. జిల్లాలోని పోచంపాడ్ వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరగడంతో ఇరు రాష్ర్టాల గ్రామా ల మధ్య రాకపోకలకు ఉన్న రహదారులు, బాటలు నీట మునిగాయి. మహారాష్ట్రలోని భూములు కూడా కొంతమేరకు ముంపునకు గురయ్యాయి. ఇందుకు పరిహారంగా అప్పట్లో నిజామాబాద్ – నాందెడ్ జిల్లాల మధ్య వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇందులో భాగంగానే 1983-84లో ప్రారంభమైన పెద్ద వంతెన నిర్మాణానికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. 1987లో ఈ పెద్ద వంతెనకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్రావు చౌహాన్ ప్రారంభోత్సవం చేశారు. అప్పటినుంచి పెద్ద వంతెన మీదుగా రాకపోకలు ప్రారంభమయ్యాయి.
వంతెన నిర్మాణంపై పర్యవేక్షణ లేదు..
తెలంగాణ – మహారాష్ట్ర మధ్య మంజీరా నదిపై ఇటు మా రాష్ట్రంలో ఏస్గీ, అటు తెలంగాణాలోని సాలూరా మధ్య జరుగుతున్న కొత్త వంతెన నిర్మాణం పనుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో ఇటు, అటు సరిహద్దులో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరుకుల రవాణా తగ్గిపోయింది. ఏడాది కిందటే కొత్త వంతెన కోసం టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు మెల్లగా పనులు చేస్తున్నారు. పనులపై పర్యవేక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ పర్యవేక్షించేవారు లేరు.. మహారాష్ట్ర అధికారుల పర్యవేక్షణ లేదు. దీంతో పనులు సరిగ్గా జరగడంలేదు. ఈ నిర్లక్ష్యం పనికిరాదు. వెంటనే వంతెన నిర్మాణం పనులు చేపట్టాలి.
30 ఏండ్లకే నూరేండ్లు..
కీలకమైన అంతర్రాష్ట్ర రహదారిపై ఇరు రాష్ర్టాల సరిహద్దుగా ఉన్న మంజీరా నదిపై నిర్మించిన ఈ పెద్ద వంతెనను స్థానిక ప్రజలు ఇప్పటికీ ‘కొత్త వంతెన’ అని పిలుస్తుంటారు. వందేండ్ల క్రితం నిజాం హయాంలో నిర్మించిన పురాతన వంతెన ఇప్పటికీ ఎంతో కొంత ఉపయోగపడుతుండగా, ‘కొత్త వంతెన’గా ఇప్పటివరకు పిలువబడుతున్న ఈ పెద్ద వంతెన శిథిలావస్థకు చేరడం ఆశ్చర్యకరం. కోట్లాది రూపాయలతో అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి నిర్మించిన ఈ పెద్ద వంతెనకు 30 ఏండ్లకే నూరేండ్లు నిండాయి. నిర్మించిన 30 ఏండ్లకే వంతెనకు పగుళ్లు రావడం ఆందోళన కలిగించింది. 2017లో ఈ పెద్ద వంతెనకు పగుళ్లు వచ్చాయి. అప్పట్లో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఈ పగుళ్లను గమనించి.. ఆ విషయాన్ని ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో మహారాష్ట్ర అధికారుల్లో చలనం వచ్చింది. ఆ పగుళ్లను పరిశీలించి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. అయితే, కొన్నాళ్లకే ఈ వంతెనకు మరికొన్ని చోట్ల పగుళ్లు రావడం, వంతెన నిర్మాణంలో భాగంగా ఉన్న బేరింగ్లు దెబ్బతిన్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ ఈ వంతెనను క్షుణ్ణంగా పరిశీలించి.. వంతెన ప్రమాదంలో ఉందని, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని తన నివేదికలో తెలిపింది. దీంతో 2020 నుంచి ఈ వంతెన మీదుగా వాహనాల రాకపోకలపై మహారాష్ట్ర అధికారులు ఆంక్షలు విధించారు. మొదట పది టన్నుల లోపు బరువు ఉన్న వాహనాలను అనుమతించిన అధికారులు.. ఆ తర్వాత కొద్ది నెలలకే ఈ వంతెనను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలకు పురాతన వంతెనే దిక్కయ్యింది. ఈ పురాతన వంతెనకు ఆఘామేఘాల మీద కొన్ని మరమ్మతు చేయించి రాకపోకల కోసం అందుబాటులోకి తెచ్చా రు. రెండేండ్లుగా ఈ పాత వంతెన మీదుగా పరిమిత బరువు ఉన్న వాహనాలను, ఆర్టీసీ బస్సులను అనుమతిస్తున్నారు. అయితే, గతేడాది సెప్టెంబర్లో మంజీరా నదికి వచ్చిన వరదల్లో పాత వంతెనపై ఉన్న కొన్ని రాతి పలకలు కొట్టుకుపోవడంతో సుమారు నెల రోజులపాటు ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఏడాది కూడా రెండు నెలలుగా అనేక రోజులపాటు మంజీరకు వరదలు రావడం, పాత వంతెన నీట మునగడం ఫలితంగా ఇరు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలు, జన సంచారం రోజుల తరబడి నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
రూ.120 కోట్లతో కొత్తగా వంతెన నిర్మాణం
మంజీరపై ఉన్న రెండు వంతెనలు శిథిలావస్థకు చేరుకోవడం, కీలకమైన ఈ అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా ప్రకటించే ప్రతిపాదన చేయడంతో.. కొత్త వంతెన నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడున్న పాత, పెద్ద వంతెనల మధ్యన ఒక భారీ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభు త్వం నిధులు మంజూరుచేసింది. రూ.120 కోట్ల వ్యయంతో ఈ భారీ వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవగా, హైదరాబాద్కు చెందిన ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకున్నది. 22 డబుల్ పిల్లర్లు, నాలుగు లేన్ల రోడ్డుతో ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన నిర్మాణం పనులు మహారాష్ట్ర ప్రభుత్వంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఏడాది కాలంలో ఈ వంతెన నిర్మాణం పూర్తిచేయాలన్న మార్గదర్శకాలు ఉండగా, పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. టెండర్లు ఖరారై ఏడాది కావస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పునాదుల పనులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. కొన్ని పిల్లర్లు లేపడానికి జరిగిన ప్రయత్నా లు తప్ప పెద్దగా పురోగతి లేకపోవడంతో ఈ వంతెన నిర్మాణం పూర్తవడానికి ఇంకా ఎన్నేండ్లు పడుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ఈ రహదారిలో సాలూరా వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ఆదాయం పూర్తిగా పడిపోయింది. భారీ వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఇరు ప్రాంతాల మధ్య సరుకుల రవాణాకు అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో ఇరు రాష్ర్టాల మధ్య సరిహద్దు ప్రాంతంలో జరిగే వర్తక, వాణిజ్యాలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఇప్పటికైనా, మహారాష్ట్ర సర్కార్ వంతెన నిర్మాణం సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.