నిజామాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;సమైక్య పాలనలో ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు.. కనుచూపు మేర పడావు భూములు.. కరవు ప్రాంతాన్ని తలపించే దృశ్యాలు . పొట్ట కూటి కోసం గల్ఫ్ బాట పట్టిన రైతులు.. అదే తెలంగాణ సిద్ధ్దించాక కరువు కనుమరుగైంది. సీఎం కేసీఆర్ చొరవతో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. బీడు భూములు పచ్చబడ్డాయి. రైతుల బతుకులు బాగుపడ్డాయి. ముఖ్యమంత్రి దార్శనికతతో సాగునీటి రంగానికి స్వర్ణయుగం వచ్చింది. కాళేశ్వరం జలాలు కిలోమీటర్ల మేర నడిచొచ్చి నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు శాశ్వత జలకళను తీసుకొచ్చాయి. దశాబ్దాల నుంచి పడావుగా ఉన్న భూములకు కాళేశ్వరం నీళ్లు జలాభిషేకం చేశాయి. మోడువారిన వరద కాలువకు కేసీఆర్ సర్కారు ‘పునరుజ్జీవం’ పోసింది. నీళ్లు లేక కన్నీళ్లే మిగిలిన రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి భరోసా కల్పించింది. పది వేల ఎకరాలకు ప్రాణం పోసేందుకు సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం పథకం ఫలాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అందుతున్నాయి. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు జరిగాయి. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 22లో భాగంగా ఉభయ జిల్లాలకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకొని సాగు నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఏదో రకంగా నీటి సౌలభ్యం తీసుకువస్తున్నారు. తలాపున ఎస్సారెస్పీ ఉన్నప్పటికీ నాన్ కమాండ్ ఏరియాలో మాత్రం నీటికష్టాలు ఉండేవి. ఈ ప్రాంతాల సాగు నీటి గోసను తీర్చేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా దాదాపు రూ.2వేల కోట్లతో చేపట్టిన పనులతో వరద కాలువలో జలకాంతులు విరాజిల్లుతున్నాయి. ఎస్సారెస్పీకి ఢోకా లేకుండా పోయింది. మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్కు గోదావరి జలాల తరలింపు ప్రక్రియతోనూ నిజాంసాగర్ పరిధిలోని ఆయకట్టుకు ఊపిరి పోసినట్లు అయ్యింది. నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలోనూ సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేపట్టిన జల సంకల్పంతో 10వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉమ్మడి జిల్లాలో రైతన్నలకు సాగు భరోసా లభించినట్లు అయ్యింది. ప్యాకేజీ 20, 21, 21ఎ పరిధిలోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందబోతున్నది. దీనికి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి.
సాగునీటి రంగానికి ప్రాధాన్యం
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపైనే అధిక దృష్టి పె ట్టారు. సాగునీటి వనరుల ను ఆధునీకరించి, కొత్తగా సాగునీటి వసతి కల్పించడమే ధ్యేయంగా లక్షల కో ట్లతో సాగునీటి రంగాన్ని పటిష్టం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునీకరణ పనులు, చెక్డ్యాముల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత, సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కృషితో నీటి ప్రాజెక్టులు ఎంతో అభివృద్ధి చెందాయి. – మోహన్ నాయక్,ఆత్మ కమిటీ చైర్మన్, బాన్సువాడ
ఎంతో అభివృద్ధి
రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం ఎంతో ప్రా ధాన్యతనిస్తున్నది. నీటిపారుదల శాఖను పూర్తిగా పునఃవ్యవస్థీకరించి డివిజన్ల వారీగా ఈఈలను ని యమించింది. జిల్లాలో 4 డివిజన్లు ఏర్పాటు చేసి ప్రతి డివిజన్కు ఈఈ స్థాయి అధికారులు రావడం, జిల్లా స్థాయిలో చీఫ్ ఇంజినీర్ను నియమించడం తో సాగునీటి వనరులపై పర్యవేక్షణ మరింత పెరిగింది. రూ.వేల కోట్లతో సాగునీటి వనరుల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో చెక్డ్యాముల నిర్మాణం, మిషన్ కాకతీయ, సిద్దాపూర్ రిజర్వాయర్, నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. – శ్రీనివాస్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్, కామారెడ్డి
మంజీరా ఎత్తిపోతల పథకం
నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల్లోని 40,768 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.476.25కోట్ల అంచనా వ్యయంతో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు పరిపాలనా ఆమోదం లభించింది. పనులు పురోగతిలో ఉండగా, ఇప్పటి వరకు రూ.30 కోట్ల విలువ గల పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 11.26ఎకరాల భూమిని సేకరించారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఆమోదించడంతో రైతులు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు.
మిషన్ కాకతీయ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న నీటి వనరులను పునరుద్ధరించేందుకు ‘మిషన్ కాకతీయ పథకం’ కింద చెరువుల మరమ్మతులు చేపటింది. జిల్లాలో 965చెరువులను రూ.279 కోట్లతో పునరుద్ధరించారు. దీంతో చెరువుల సామర్థ్యం పెరిగి ఆయకట్టు కింద సాగు, భూగర్భ జలాలు అధికమయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలు, ఉప కా లువల ఆధునీకరణకు రూ.276.2కోట్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.250. 60కోట్ల విలువ గల పనులు పూర్తి చేశారు. మిగితా పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం జలాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్యాకేజీ నంబర్ 22 కింద కామారెడ్డి జిల్లాలో 1,84,854 ఎకరాలకు, నిజామాబాద్ జిల్లాలో 3,300 ఎకరాలకు, మెదక్ జిల్లాలో 12,146 ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.1,446 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రూ.445.98 కోట్లు ఖర్చు చేసి పనులను కొనసాగిస్తున్నారు. వారం రోజుల క్రితమే రూ.850 కోట్ల నిధులు మంజూరు కాగా, వీటి ద్వారా ప్రధాన కాలువలు, ఉప కాలువలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోని మెట్టప్రాంతాలకు సాగునీరు అందనున్నది. అలాగే మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్ ద్వారా నిజాంసాగర్లోకి నీరు వచ్చేలా కాలువల నిర్మాణం చేపట్టగా, ప్రస్తుతం సాగునీరు ప్రాజెక్టులోకి చేరుతున్నది. హల్దీ వాగు నుంచి మంజీరాలోకి నీరు వచ్చేలా పనులు కొనసాగుతున్నాయి.
చకచకా సిద్దాపూర్ రిజర్వాయర్…
వర్ని మండలం సిద్దాపూర్లో నిర్మిస్తున్న రిజర్వాయర్తో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లోని రైతుల సాగు భూములకు మేలు చేకూరనున్నది. అటవీ ప్రాంతంలో కేవలం 614 ఎకరాల ఆయకట్టు కలిగిన చద్మల్, పైడిమల్, నామ్కల్ చెరువులను ఒకే చోట కలిపేసి… రిజర్వాయర్గా మార్చబోనున్నారు. దీని ఆనకట్ట దాదాపుగా 3.6 కిలో మీటర్ల మేర నిర్మించబోతున్నారు. ఈ మూడు చెరువుల ఉన్నతీకరణతోపాటు కెనాల్స్ ద్వారా సాగునీటి సరఫరా ఏర్పాటుకు మొత్తం రూ.119 కోట్లను మంజూరు చేసింది. ఫలితంగా 10వేల ఎకరాలకు సాగు నీటి ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రిజర్వాయర్ పనుల కోసం రూ. 72.52 కోట్లు, గ్రావిటీ ద్వారా కెనాల్స్ నిర్మాణానికి రూ.46.89 కోట్లను మంజూరు చేశారు. నాన్ కమాండ్ ఏరియాగా మారిన భూములకు సాగు నీటి సౌకర్యం కల్పించాలనే యోచనతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
నిండుకుండలా నిజాంసాగర్…
వరద ప్రవాహం లేక కనిష్ఠ నీటి నిల్వతో కొట్టుమిట్టాడే నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఆశాజనక పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు నిండుకుండను తలపించగా కేవలం సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు మాత్రమే కళావిహీనంగా కనిపించాయి. వానకాలం, యాసంగి పంటల సాగుకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిల చొరవతో నీళ్లు సర్దుబాటు చేసేవారు. 2016లో చివరిసారిగా నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువ మంజీరా నదిలోకి నీళ్లను వదిలిపెట్టారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్కు తరలించే ప్రక్రియ పూర్తి కావడంతో ఆయకట్టు రైతుల్లో భరోసాను నింపింది.
వరద కాలువకు జీవం..
బోసిపోతున్న పోచంపాడ్ ప్రాజెక్టుకు కొత్త కాంతులు తీసుకురావాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ సంకల్పించిన పునర్జ్జువ పథకం మూలంగా నేడు వరద కాలువ నిండుగా జలజీవంతో కనిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు పంపి తద్వారా ఎస్సారెస్పీకి నీటిని మళ్లించాలని తొలుత ప్రభుత్వం భావించింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ఇంజినీర్లతో సంప్రదించి వరద కాలువ 102వ కిలోమీటరు వరకు కాళేశ్వరం జలాలను తరలించి అక్కడి నుంచి కొత్త కాలువలు, పైపులైన్లు, భూసేకరణ లాంటివి అవసరమే లేకుండా రెడీగా ఉన్న వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేయాలని భావించారు. అలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని తీసుకువచ్చారు. దీంతో వరదకాలువ మూడుసార్లు నింపి మూడు కాలాలు నిండుకుండలా ఉండేలా మార్చేశారు.
చెక్డ్యాముల నిర్మాణం
కామారెడ్డి జిల్లాలో 43 చెక్డ్యాముల నిర్మాణానికి రూ.270.65కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 30 చెక్డ్యాముల కోసం రూ.165.12 కోట్లు మంజూరు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో 5చెక్డ్యాముల కోసం రూ.7.40కోట్లు, బాన్సువాడలో రెండు చెక్డ్యాములకు రూ.44.28కోట్లు, జుక్కల్లో 12 చెక్డ్యాములకు రూ.65.35కోట్లు, ఎల్లారెడ్డిలో 22 చెక్డ్యాములకు రూ.54.85కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.63.71 లక్షల విలువ చేసే 26 పనులు పూర్తయ్యాయి. బాన్సువాడ సమీపంలోని మంజీరా నదిపై నిర్మించిన చెక్డ్యాముతో ఇప్పటికే అక్కడ నీరు భారీగా నిల్వ ఉన్నది. ఆర్ఆర్ఆర్ ఫేజ్-3 కింద 65 పనులను రూ.27కోట్ల 38లక్షల వ్యయంతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతి ఇవ్వగా, 62 పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.15.67 కోట్లను ఖర్చు చేసింది.