నిజామాబాద్ క్రైం, జూన్ 3 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నది. పదేండ్లలో పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసువ్యవస్థను పటిష్ట పరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏదైనా నేరం జరిగిన సమయంలో పోలీసులు ఘటనాస్థలానికి వేగంగా చేరుకునేలా అవసరమైన నూతన వాహనాలను సమకూర్చారు. పోలీసులు అంటే ప్రజల్లో భయం వీడేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకువచ్చారు. మహిళలకు పోకిరీల బెడద నుంచి రక్షణ కల్పించేందుకు షీ టీములను ఏర్పాటుచేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చి, పకడ్బందీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా నూతన టెక్నాలజీని తీసుకువచ్చారు.
పోలీసుశాఖ ఆధ్వర్యంలో నేడు ‘సురక్షా దినోత్సవం’
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేండ్లలో పోలీసు వ్యవస్థలో చేపట్టిన మార్పులు, శాంతి భద్రతల పరిరక్షణకు అమలుచేస్తున్న విధి విధానాలు, సాధించిన విజయాలు, పోలీసువ్యవస్థలో వివిధ విభాగాల పనితీరు తదితర అంశాలపై పోలీసులు ప్రజలకు వివరించనున్నారు.
జిల్లాలో 2016లో సివిల్ సిబ్బంది 107, ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో 62 పోస్టులు, 2018లో సివిల్ విభాగంలో 210 పోస్టులు, ఏఆర్ విభాగంలో 74 పోస్టులను భర్తీ చేశారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏఆర్, సివిల్ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుళ్ల భర్తీకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్సై, కానిస్టేబుళ్ల భర్తీకి సుమారు నాలుగు వందల పోస్టులను కేటాయించారు. ఉద్యోగాలకు యువత భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. 5,280 మంది అభ్యర్థులు పరీక్షలకు అర్హత సాధించగా.. 5,230 మంది హాజరయ్యారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ‘నిఘా’..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధుల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. నేనుసైతం కార్యక్రమంలో భాగంగా 4,434, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా 4,013 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ కోసం మండలాలు, గ్రామాల్లో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించి, సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరించారు. వీడీసీలు, దాతల సహకారంతో గ్రామాలు పెద్ద మొత్తంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకున్నాయి.
మంత్రి చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ప్రారంభం
జిల్లాకేంద్రంలోని కమిషనరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను రెండు నెలల క్రితం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణలో హెచ్డీ క్వాలిటీతో 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు, జంక్షన్ల వద్ద 132 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. మరో 28 ప్రత్యేక కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లఘించే వారికి ఫైన్ విధించేలా ఏర్పాటు చేశారు.
‘మై ఆటో.. మై సేఫ్’, డ్రంక్ అండ్ డ్రైవ్పై పటిష్ట నిఘా..
ఆటో రిక్షాల్లో ప్రయాణించే వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకొనేలా పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనరేట్లో ‘మై ఆటో.. మై సేఫ్’ యాప్ను 2018లో ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లాలోని 4,500 ఆటోలు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు మద్యం తాగి వాహనాలు నడుపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం ద్వారా కలిగే అనర్థాలపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్గా అప్గ్రేడ్..
పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిజామాబాద్ను రెండు జిల్లాలుగా ఏర్పాటుచేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లాను పోలీస్ కమిషనరేట్గా అప్గ్రేడ్ చేశారు. మూడు డివిజన్ల పరిధిలో 9 సర్కిల్ కార్యాలయాలు, 32 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,515 సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న మండలాలు, జనాభా ప్రాతిపదికన అదనంగా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో ఆరోటౌన్తోపాటు మోపాల్, ఇందల్వాయి, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, బోధన్ రూరల్, రుద్రూర్లో మొత్తం ఎనిమిది కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటుచేశారు. నిజామాబాద్ వన్టౌన్ పోలీస్స్టేషన్, రూరల్, రెంజల్ ఎస్సై క్వార్టర్స్ భవనాల నిర్మాణం పూర్తిచేశారు.
పోలీస్స్టేషన్ల నిర్వహణకు ప్రతినెలా డబ్బులు మంజూరు..
పోలీస్స్టేషన్లలో కనీస అవసరాల కోసం ప్రభుత్వం ప్రతినెలా డబ్బులు అందజేస్తున్నది. మండల పోలీస్స్టేషన్లకు ప్రతి నెలా రూ.25 వేలు, పట్టణ స్టేషన్లకు రూ. 50 వేలు, మెట్రో పోలీస్స్టేషన్లకు రూ.75 వేలు అందజేస్తున్నది. అంతే కాకుండా ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించే సిబ్బందికి 30 శాతం అదనపు అలవెన్స్ సైతం అందజేస్తున్నది.
హరితహారంలో భాగంగా 15 లక్షల మొక్కలు నాటిన పోలీసులు..
అడవుల సంరక్షణకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పోలీసులు చురుగ్గా పాల్గొంటున్నారు. కమిషనరేట్లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. 2016 నుంచి 2022 వరకు 14,92,098 మొక్కలను పోలీసులు నాటి సంరక్షిస్తున్నారు.
పోలీసులకు వాహనాల అందజేత..
నేరాలు జరిగిన వెంటనే పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకునేందుకు అవసరమైన కొత్త వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. 2014 వరకు జిల్లాలో పోలీసులకు కేవలం 21 వాహనాలు మాత్రమే ఉండేవి. ఇన్నోవా, స్కార్పియో తదితర కొత్త వాహనాలను అందజేయగా.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 148 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 2014 సంవత్సరానికి ముందు 8 ద్విచక్రవాహనాలు ఉండగా.. 278 కొత్త ద్విచక్రవాహనాలను సిబ్బందికి అందజేశారు. జిల్లాలో మొత్తం 286 వాహనాలు పనిచేస్తున్నాయి. వీటితో పోలీసులు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.
మహిళ సంరక్షణ కోసం షీ టీముల ఏర్పాటు..
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు, దాడులను అరికట్టెందుకు నిజామాబాద్ కమినరేట్లో సైతం 2015లో షీ టీములను ఏర్పాటుచేశారు. జిల్లాలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ఏరియాలతోపాటు రద్దీ ప్రదేశాలు, కళాశాలల వద్ద మహిళల భద్రత కోసం షీటీం సిబ్బంది మఫ్టీలో నిఘా పెట్టి ఆకతాయిల నుంచి రక్షణ కల్పిస్తున్నారు. మహిళలకు ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదురైన సమయంలో సమస్యల పరిష్కారానికి డయల్ 100, 8712659795 నంబర్లను ఏర్పాటుచేశారు. బాధితులు ఫోన్ చేసిన వెంటనే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తున్నారు.