బోధన్, ఆగస్టు 31: బీసీల అభ్యున్నతి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్ ‘బీసీ బంధు’ పథకం ప్రవేశపెట్టారని, ఇది నిరంతర ప్రక్రియ అని బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ అన్నారు. బోధన్ నియోజకవర్గం ‘బీసీ బంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం బోధన్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. రూ.లక్ష చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రానున్న రోజుల్లో దరఖాస్తు చేసుకున్న సీనియారిటీని బట్టి ఇస్తామన్నారు. బీసీ బంధును సద్వినియోగం చేసుకుని తమ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో మైనార్టీబంధును ప్రారంభిస్తామ న్నారు.బోధన్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బిల్లులను నాలుగైదు రోజు ల్లో ఇస్తామన్నారు.
‘నేను నియోజకవర్గం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తొమ్మిదేండ్లుగా కష్టపడి పని చేశా.. అయినా నా మీద కొంతమందికి కోపం ఉండవచ్చు.. అటువంటివారు నన్ను చూసికాదు.. నన్ను క్షమించి కేసీఆర్ను చూసి ఓటేయండి.. రాష్ట్రంలో ఒక మంచి నాయకుడికి మద్దతుగా నిలవండి’ అంటూ సభలో ఎమ్మెల్యే షకీల్ అభ్యర్థించారు. ఎన్నికలకు ముందు వస్తున్న కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు.
రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు. గొర్రెల యూనిట్లను బోధన్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 115 మంది లబ్దిదారులకు యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా కుర్మ, గొల్ల కులాల నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.