వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. బాధితులకు తక్షణమే వైద్యసేవలు అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. అవసరమైన మందులను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందంటున్న వైద్యులు.. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని ప్రజలకుసూచిస్తున్నారు. దీనిపై పల్లెల్లోవిస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
-ఖలీల్వాడి, సెప్టెంబర్ 20
ఖలీల్వాడి, సెప్టెంబర్ 20 : నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు డెంగీ ప్రబలుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వం సీజనల్ వ్యాధులపై అలర్ట్ ప్రకటించింది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అత్యవసరంమైతే తప్ప.. ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని, సీజనల్ వ్యాధుల నియంత్రణ దిశగా సమష్టిగా పనిచేయాలని సూచించింది. దీంతో జిల్లాలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమయ్యింది.విష జ్వరాల బారిన పడిన వారిని సంబంధిత వైద్య సిబ్బందిని సమీప దవాఖానలకు పంపి చికిత్స చేయించేలా చర్యలు చేపడుతున్నారు. విషజ్వరాలకు కావాల్సిన మందులన్నీ అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా దవాఖానలు, అర్బన్ సెంటర్లు 10, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 8 ఉన్నాయి. వీటి పరిధిలో ఎప్పటికప్పుడు నమోదవుతున్న వ్యాధుల వివరాలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. వారానికొకసారి ఈ నివేదికను పంపుతున్నారు. దీన్ని బట్టి సరిపడా మందులు, కెమికల్స్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నది. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా మందులు ఉన్నాయని డిప్యూటీ డీఎంహెచ్వో, మలేరియా అధికారి తుకారాం రాథోడ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు పంపిన నివేదికలో జిల్లాలో 38 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు డెంగీతో ఎవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని చెబుతున్నారు.
వానకాలం కావడంతో దోమల బెడద పెరిగి వ్యాధులు విజృంభిస్తున్నాయని, పల్లెల్లో దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వైరల్ ఫీవర్ బారిన పడిన వారి సంఖ్య పెరడంతో ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేకంగా ‘ఫీవర్ క్లినిక్’ను ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్ర దవాఖాన రోగులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తుండడంతో రోగుల తాకిడి ఎక్కువైంది. వైద్య, రక్త పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోనే చేయడంతో హౌస్పుల్గా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఓపీ సేవలు ఎక్కువ అయ్యాయని, రోజుకు సుమారు 1,500 నుంచి 1,700 మంది రోగులు వస్తున్నారని దవాఖాన సిబ్బంది తెలిపారు. ఐపీ విభాగం నిండిపోవడంతో సూపరింటెండెంట్ పర్యవేక్షణలో సిబ్బందిని నియమించి సేవలందిస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానలో రోగుల సంఖ్య పెరగడంతో నిరంతర పర్యవేక్షణలో వైద్యసేవలను అందిస్తున్నాం. వైద్యులందరూ అందుబాటులో ఉన్నారు. వైరల్ ఫీవర్ల విషయమై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం. దవాఖానలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం.
– ప్రతిమారాజ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోగాల బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలి. వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నది. స్వచ్ఛమైన నీరు తాగాలి. శుభ్రంగా ఉన్న ఆహారం తినాలి. వైరల్ ఫీవర్లకు సంబంధించి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మందులను అందుబాటులో ఉంచాం.
-డాక్టర్ సుదర్శనం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి