నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ అంశాల్లో మొత్తం 415 ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా జిల్లా సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఖలీల్వాడి డిసెంబర్ 5: నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సమాచారం, టెక్నాలజీ, పర్యావరణం, గణితం తదితర అంశాలపై 415 ప్రయోగాలను ప్రదర్శించగా, జిల్లావ్యాప్తంగా ఆయ పాఠశాలల నుంచి మొత్తం 1600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ఫేర్ను నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు తిలకించారు. ముఖ్య అతిథులుగా జిల్లా సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతితోపాటు టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సివిల్ జడ్జి మాట్లాడుతూ.. సైన్స్ అనేది నిత్య జీవితానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు ప్రజలకు ఉపయోగకరమైన ప్రయోగాలు చేయడం అభినందనీయమని అన్నారు.
ఇంతటితో ఆగిపోకుండా కొత్త ఆలోచనలతో మరిన్ని ఆవిష్కరణలు చేయాలన్నారు. సౌరశక్తి వంటి సహజ వనరులను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, అందులో మనం చూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జడ్పీ చైర్మన్ విఠల్రావు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఆలోచనలు, ప్రయోగాలతో ముందుకు రావాలని అన్నారు. విద్యార్థుల ప్రతిభ, మేథాశక్తిని మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించి వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు.