బాన్సువాడ, జనవరి 13: సంక్రాంతి వస్తుందనగానే ఆ ఊరివారంతా ఒక్కచోటికి చేరుతారు. ఇతర దేశాలు, రాష్ర్టాలు, పట్టణాల్లో ఉన్నవారంతా సొంతూరికి వస్తారు. ఊరంతా కలిసి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామం పండుగకు పూర్వవైభవం తెస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న జన్మభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంబరాన్నంటుతాయి. సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే వేడుకలతో ఊరంతా సందడి నెలకొంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో తీరికలేని జీవితం గడుపుతారు ఇక్కడివారు కొందరు. మూడు రోజుల పాటు ల్యాప్టాప్, సెల్ఫోన్లను పక్కనపెట్టి పల్లెవాతావరణంలో పిల్లలతో కలిసి సంక్రాంతి సంబురాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటారు.
ఉమ్మడి జిల్లాలో రైతునగర్ ప్రత్యేకం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే సంక్రాంతి పండుగకు చిరునామాగా రైతునగర్ గ్రామాన్ని చెప్పవచ్చు. ఎక్కడా లేనివిధంగా గ్రామమంతా చిన్నాపెద్ద, తారతమ్యం లేకుండా కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగంగా గ్రామమంతా ఒకే కుటుంబంలా వేడుకలు నిర్వహించేలా గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు, పెద్దలు కూడి జన్మభూమి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహిస్తారు. ఎంతో దూరంలో స్థిరపడిన వారంతా సంక్రాంతి వచ్చిందంటే పుట్టిన ఊరికి వచ్చి సంబురాల్లో పాల్గొంటారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. గ్రామంలోని మూలమలుపుల వద్ద బంధువులతో కలిసి భోగి మంటలు వేస్తారు. అక్కడి నుంచి గ్రామంలో వయసు భేదం లేకుండా హరిదాసుడి ఆటలు, కుర్చీల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు,కబడ్డీ, తాడు గుంజుడు,చిన్నారులకు కైట్ ఫెస్టివల్, మహిళలకు ముగ్గుల పోటీలు, వాలీబాల్తోపాటు నృత్యప్రదర్శనలను నిర్వహిస్తారు. సోమవారం గ్రామంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం రోజు జన్మభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటారు. సాయంత్రం వేళ ప్రతి ఏటా మాదిరిగానే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులను ఆహ్వానించి సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రదానం, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు.
ముచ్చటగా మూడురోజుల పండుగ
సంక్రాంతి పండుగను రైతునగర్ గ్రామస్తులు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు పచ్చని తోరణాలు, ముంగిట ముగ్గులు, రోడ్ల వెంట లైటింగ్, చిన్నారుల నృత్యాలు, పెద్దలకు క్రీడాపోటీలు, వృద్ధుల రచ్చబండ ముచ్చట్లు ఇలా గ్రామమంతా సందడి వాతావరణం నెలకొంటుంది.
ప్రగతికి చిరునామాగా..
రైతునగర్ గ్రామం 75 ఏండ్ల క్రితం గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఏలూరు, ఒంగోలు తదితర గ్రామాల నుంచి వచ్చిన ఐదు కుటుంబాలతో ఏర్పాటైనట్లు చెబుతారు. వ్యవసాయం నిమిత్తం అమరనేని శివయ్య అనే వ్యక్తి మొదటగా వచ్చి గుడిసెలు వేసుకొని జీవించారని గ్రామస్తులు చెబుతారు. అనంతరం వ్యవసాయంలో ఆదర్శంగా నిలువడంతో గ్రామానికి రైతునగర్గా పేరు వచ్చిందని, అప్పట్లో రంగనాయకులు గ్రామ ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. గ్రామంలో కరెంటు, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రైతునగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సహకారం, సర్పంచ్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో రైతునగర్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
సంక్రాంతికి వచ్చాం..
ఏటా సంక్రాంతికి సొంతూరికి వస్తాం. వైభవంగా గ్రామస్తులందరం కలిసి పండుగను నిర్వహించుకుంటాం. పనులన్నీ పక్కనపెట్టేసి కలిసి ఒక్కచోట చేరి మాట్లాడుకుంటాం. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటాం. ఊరువాడా అంతా పచ్చని తోరణాలు., రం గుల లైట్ల కాంతులు ఎక్కడ చూసినా పం డుగే. మర్చిపోలేని అనుభూతి కలుతుంది.
– పాలేటి రామ్చరణ్, యశిని, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు(ఆస్ట్రేలియా)
సంతోషంగా ఉన్నది..
ఎంత పెద్ద పదవిలో, బిజీగా ఉన్నా సం క్రాంతికి సొంతూరికి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో మాటామంతి, ఊరంతా కలిసి కుటుంబీకులు గా వేడుకలను ఘనంగా జరుపుకుంటాం. ఖండాంతరాలు దాటి వచ్చి వేడుకల్లో పాల్గొనడం విశేషం.
– సత్యనారాయణ, అదనపు డీసీపీ, హైదరాబాద్