బాన్సువాడ, ఫిబ్రవరి 23: సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం అనుసరణీయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, గొప్ప శక్తి అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో గురువారం సేవాలాల్ మహరాజ్ 284 జయంతిని అధికారికంగా నిర్వహించగా.. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి సభాపతి పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ చిత్ర పటానికి సభాపతి పూలమాల వేసిన అనంతరం నిర్వహించిన భోగిభండార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాపతి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. చరిత్ర సృష్టించిన మహనీయుల పుట్టిన రోజులను అధికారికంగా జరుపుకుంటారని, అది మనం వారికి ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు.
సేవాలాల్ ఎన్నో అద్భుతాలు చేశారని తెలిపారు. ఆయన సందేశం, బోధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి తండాలో జగదాంబ సేవాలాల్ ఆలయాలకు నిధులు మంజూరుచేయించి నిర్మించినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గానికి నూతనంగా గిరిజన బాలికల గురుకుల పాఠశాల మంజూరైందని తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మం డలం హన్మాజీపేట్- కోనాపూర్ గ్రామాల వద్ద ఏర్పాటు చేస్తారని, భవనాలు, ఇతర వసతుల కోసం రూ. 43 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామన్నారు. బిడ్డకు తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేసినందుకు బాన్సువాడ మాతా శిశు దవాఖానకు జాతీయస్థాయిలో ఖ్యాతి దక్కిందన్నారు.
పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. త్వరలోనే సర్వే పూర్తిచేసి అర్హులకు పట్టాలను అందజేస్తామన్నారు. మార్చి 11న మంత్రి సత్యవతి రాథోడ్ బాన్సువాడకు రానున్నారని తెలిపారు. నస్రుల్లాబాద్ గిరిజన బాలుర పాఠశాలలో రూ.7 కోట్ల తో స్టాఫ్ బిల్డింగ్ తో పాటు అదనపు భవనం, పక్కనే రాంరావ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. గిరిజన చిన్నారులు, బాలురు నిర్వహించిన బంజారా సంప్రదాయ నృత్యాలతో అలరించారు. అనంతరం నస్రుల్లాబాద్ మండలానికి చెందిన పది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను స్పీకర్ పోచారం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్, కలెక్టర్ను బంజారా నాయకుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు గంగాధర్, విఠల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, పిట్ల శ్రీధర్, మహ్మద్ ఏజాస్, గోపాల్ రెడ్డి, పాత బాలకృష్ణ, బంజారా జిల్లా నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ , బద్యానాయక్, బాల్ సింగ్, బన్సీనాయక్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, పాల్త్య విఠల్, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, జన్నూబాయి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, వైస్ ఎంపీపీ హరిసింగ్, సర్పంచులు పాల్గొన్నారు.