బాన్సువాడ రూరల్, జూన్ 16: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో వాటి రూపురేఖలు మారిపోయాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలే సర్పంచులుగా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్తండా గ్రామంలో జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయ 16వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం సేవాలాల్ మహరాజ్, రాంరావ్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భోగ్ బండార్ కార్యక్రమంలో గిరిజనులతో కలిసి పాల్గొన్నారు. సేవాలాల్, రాంరావ్ మహరాజ్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గిరిజనులను సన్మార్గంలోకి మళ్లించిన గొప్ప వ్యక్తి రాంరావ్ మహరాజ్ అని పేర్కొన్నారు. ఆయన ఆశీస్సులు గిరిజనులకు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గొప్ప గురువుగా రాంరావ్ మహరాజ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా బాన్సువాడ నియోజకవర్గంలో జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయాల ని ర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని కోనాపూర్ – హన్మాజీపేట్ గ్రామాల మధ్య గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతోపాటు భవనాల నిర్మాణం కోసం రూ. 12 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నెల 26న గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందించనున్నట్లు చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు (శనివారం)నస్రుల్లాబాద్ ఎస్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన దినోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. అంతకుముందు ఆలయంలో రూ. 35.50లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలు, షెడ్డు, ప్రహరీ, సీసీ ప్లాట్ఫాంలను ప్రారంభించారు. కార్యక్రమంలో పౌరాదేవి పీఠాధిపతి బాబూసింగ్ మహరాజ్, బంజారా సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు నెనావత్ బద్యానాయక్, వైస్ ఎంపీపీ హరిసింగ్, గ్రామ సర్పంచ్ లలిత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, బాన్సువాడ విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, తండా పెద్దలు గోప్యానాయక్, ప్రకాశ్, అంబర్సింగ్, బలరాం, శ్రీనివాస్, రామురాథోడ్, ఫకీరా నాయక్, గంగారాం, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, సాయిరెడ్డి, బన్సీనాయక్, చందర్ తదితరులు పాల్గొన్నారు.