ఖలీల్వాడి, డిసెంబర్ 27: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. పండుగ కోసం రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా రీజినల్ మేనేజర్ ఉష తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్కు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సురక్షితంగా సుఖవంతమైన ప్రయాణంతో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ముందస్తు రిజర్వేషన్లకు www.tsrtc online.in ను సంప్రదించాలని సూచించారు.