రూ. 1.70 లక్షల నగదు మాయం
ఎల్లారెడ్డి రూరల్, జూన్ 19 : పట్టణంలోని తెలంగాణతల్లి ప్రాంగణం ఎదురుగా పండరి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రంలో చోరీ జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజూ మాదిరిగానే శనివారం రాత్రి మీసేవ యజమాని పండరి దుకాణ షట్టర్కు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. తెల్లవారి వచ్చి చూసే సరికి షట్టరుకు ఉన్న తాళం పగులగొట్టి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే దుకాణంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా.. శనివారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగుడు దుకాణం తాళాలు పగులగొట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న సుమారు లక్షా 70వేల రూపాయలను దొంగిలించినట్లు గుర్తించాడు.
ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలుపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ పుటేజీలను పరిశీలించారు. దుకాణాల్లోని సీసీ పుటేజీలలో దుండగుని ముఖం తెలియడం లేదని, దుకాణానికి ఎదురుగా ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన సీసీ పుటేజీలను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.