ఇందల్వాయి, అక్టోబర్ 14 : దసరా పండుగను కుటుంబీకులతో కలిసి ఆనందంగా జరుపుకొందామనుకున్న వారి ఆశ అలాగే ఉండిపోయింది. సంతోషంగా స్వగ్రామాలకు బయల్దేరిన వారి ప్రాణాలు రోడ్డుప్రమాదంలో గాలిలో కలిసిపోయాయి. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు యూపీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
ఇందల్వాయి ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఇందల్వాయి మండలంలోని దగ్గి వైపు నుంచి డిచ్పల్లి వైపు వస్తున్న వరి కోత మిషన్ బ్రేక్డౌన్ అయి రహదారిపై నిలిచిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న ఓ బస్సు.. వరి కోత మిషన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్నవారికి గాయాలయ్యాయి. వెంటనే ఏం జరిగిందో చూడడానికి బస్సులో నుంచి ఎనిమిది మంది కిందికి దిగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం వీరిలో నలుగురిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాకు చెందిన గణేశ్ (29), దుర్గేశ్ ప్రసాద్ (16), గోరఖ్పూర్ జిల్లాకు చెందిన ప్రదీప్ (40), సిద్ధార్థ నగర్కు చెందిన జిత్తు (32) ఉన్నారు. దసరా పండుగ కోసం మూడు బస్సుల్లో యూపీకి చెందిన వలస కూలీలు హైదరాబాద్ నుంచి యూపీలోని తమ స్వగ్రామాలకు వెళ్తుండగా.. ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. రహదారి రక్తసిక్తంగా మారింది. మృతిచెందిన వారిని చూసి మిగిలిన కూలీలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రదీప్ సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. అతివేగంగా వాహనం నడిపి నలుగురి చావుకు కారణమైన డీసీఎం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సుతోపాటు నలుగురిని ఢీకొట్టిన డీసీఎం వాహనాన్ని పోలీసులు డిచ్పల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.