మెండోరా, డిసెంబర్ 16: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టుకు కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటల కోసం నీటి విడుదలను శుక్రవారం ప్రారంభించినట్లు ఏఈ చక్రపాణి తెలిపారు. యాసంగి సీజన్ పంటల సాగు కోసం కాలువ ద్వారా విడుదల చేస్తున్న ప్రతి నీటి చుక్కను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కాలువ ద్వారా వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తున్నామన్నారు. ఎనిమిది రోజులపాటు ఎగువ ఎల్ఎండీ వరకు, వారం రోజులు ఎల్ఎండీ కింద నీటి సరఫరా ఉంటుందని వివరించారు. వారబందీ ప్రకారం ఉప కాలువలతో పంట పొలాల వరకు నీటి సరఫరా అవుతుందన్నారు. యాసంగి నుంచి పంటల కోసం 63 టీఎంసీల నీటిని కేటాయించినట్లు చెప్పారు. కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేపట్టామన్నారు. క్రమక్రమంగా నీటి విడుదల పెంచుతామన్నారు. కార్యక్రమంలో ఏఈ వంశీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి అనుసంధానంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం జెన్కోలో కాకతీయ కాలువ నీటి విడుదలతో ఉత్పత్తి ప్రారంభమైనట్లు జెన్కో ఈఈ శ్రీనివాస్ తెలిపారు. 2500 క్యూసెక్కుల నీటిని వినియోగించి ఒక టర్బాయిన్ ద్వారా తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. క్రమంగా నీటి విడుదల పెరిగితే మరింత విద్యుత్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.