డిచ్పల్లి, ఏప్రిల్ 20 : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈసీ అనుమతి లేకుండా దినసరి వేతనంపై నియమించిన సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేశామని రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. పాలక మండలి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్గా యాదగిరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీయూ పరిపాలనా భవనంలోని తన చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. బుధవారం హైదరాబాద్ రుసా భవనంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వెల్లడించారు. ఈసీలో తీర్మానించిన అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ముఖ్యంగా ఈసీ అనుమతి లేకుండా దినసరి వేతనం కింద నియమించిన సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశించామన్నారు. పార్ట్టై మ్, అక్రమ అవుట్ సోర్సింగ్ నియామకాలు, ఉద్యోగోన్న తులు, సీఏఎస్ ప్రమోషన్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఈసీ సమావేశంలో అనుమతి తీసుకొని ప్రమోషన్ల కోసం నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఈసీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అధ్వర్యంలో త్వరలో విచారణ చేపడుతామన్నారు. 2021 నవంబర్ 27తర్వాత యూనివర్సిటీలో జరిగిన కొనుగోళ్లు, చెల్లింపులు, నియామకాలు, ప్రమోషన్లు, నిధుల దుర్వినియోగంపై కమిటీ విచారణ జరుపుతుందన్నారు. నిధుల దుర్వినియోగం వాస్తవమని తేలితే బాధ్యుల నుంచి నిధులను రికవరీ చేస్తామన్నా రు. టీయూలో పాలనను గాడిలో పెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రిజిస్ట్రార్ యాదగిరి స్పష్టం చేశారు.
150 మంది ఇక ఇంటికే..
తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ఛాన్సలర్ రవీందర్గుప్తాకు ముడుపులు అందజేసి విధుల్లో చేరిన 150 మంది దినసరి వేతన సిబ్బంది ఇక ఇంటి దారి పట్టనున్నారు. శుక్రవారం నుంచి విధులకు హాజరు కావద్దని రిజిస్ట్రార్ సూచించిన నేపథ్యంలో సెక్యూరిటీ గార్డు మొదలుకొని స్కావెంజర్, అటెండర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఇది వరకే టీయూలో దినసరి వేతనంతో పని చేస్తున్న సిబ్బందికి రెండు నెలల వేతనం, మరికొందరికి నెల రోజుల వేతనం అధికారులు ఇచ్చినట్లు తెలిసింది. పూర్తికాలం యూనివర్సిటీలోనే పని చేస్తామన్న నమ్మకంతో అప్పు చేసి కొందరు వీసీకి ముడుపులు ఇస్తే మూడు నెలల్లో వారి మురిపెం తీరినట్లయింది.
ఆందోళనలో దినసరి వేతన సిబ్బంది…
టీయూలో మూడు నాలుగు నెలలుగా దినసరి వేతనంపై పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్లో జరిగిన టీయూ పాలకమండలి సమావేశంలో ఎలాంటి అనుమతి లేకుండా తీసుకున్న సిబ్బందిని విధులకు రావద్దని ఈసీలో తీర్మానించడంతో దినసరి వేతన సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయోలేదోనన్న భయం వారిలో నెలకొన్నది. ఎలాగైనా ఇచ్చి డబ్బులు వసూలు చేసుకోవాలన్న ఆలోచనలో దినసరి వేతన సిబ్బంది ఉన్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయోలేదో వేచి చూడాలి మరి.
పలు విభాగాలను సందర్శించిన రిజిస్ట్రార్
టీయూ పరిపాలన భవనంలోని పలు విభాగాలను రిజిస్ట్రార్ యాదగిరి సందర్శించారు. సిబ్బంది వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. సమయ పాలన పాటిస్తూ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచనలు చేశారు.
రిజిస్ట్రార్ను కలిసిన సీఐ, ఎస్సైలు…
రిజిస్ట్రార్ యాదగిరిని ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె.కృష్ణ, ఎస్సై గణేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీయూకు సంబంధించిన పలు వివరాలను రిజిస్ట్రార్ను అడిగి తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయంలో రాత్రి పూట రెండు మూడు సార్లు పెట్రోలింగ్ నిర్వహిస్తామని సీఐ తెలిపారు.