నిజామాబాద్ కల్చరల్, డిసెంబర్ 14 : శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణి. చిన్నపిల్లలు, పశువులు, పాములు ఇలా జీవజాలాన్నంతటిని రంజింపచేయగలిగే ధ్వని సంగీతం. గీతం వాద్యం తథా నృత్యం. త్రయం సంగీత ముచ్చత్తే… రాగం, స్వరం, తాళం అను ఈ మూడింటి చేరికయే సంగీతమని పెద్దలన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు సంగీత నృత్య పాఠాలు నేర్చుకొనే విద్యాసంస్థగా గుర్తింపు పొందింది ఇందూరులోని శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల. ఇక్కడ శిక్షణ పొందిన వారు వందల సంఖ్యలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. పరిశోధన రంగంలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు సాధించారు.
1972లో నిజామాబాద్ నగరంలో సంగీత నృత్య పాఠశాలను స్థాపించారు. మొదట్లో పాలిటెక్నిక్ కళాశాలకు అనుబంధంగా ఉండేది. ప్రత్యేక శాఖగా ఖలీల్వాడిలోని అద్దె భవనంలోకి మారింది. సుభాష్నగర్లో సుమారు పదేండ్లు కొనసాగింది. అప్పటి కలెక్టర్ సీతారామాంజనేయులు ఆదేశాలతో జిల్లా బాలభవన్, అక్కడి నుంచి ఎల్లమ్మగుట్టకు తరలించారు. అనంతరం సుభాష్నగర్లో 705 గజాల స్థలంలో రూ. 50లక్షలతో నూతనంగా నిర్మించిన భవనంలో శిక్షణ కొనసాగుతున్నది. 50ఏండ్లుగా యువతకు అలంబనగా నిలుస్తున్నది. 50మందితో ప్రారంభమైన ఈ సంగీత నృత్య కళానిలయం.. ప్రస్తుతం 400 మందికి పైగా విద్యార్థులతో అలరారుతున్నది.
ప్రస్తుతం ఇక్కడ హిందుస్థానీ, కర్ణాటక గాత్రం, పేరిణి శాస్త్రీయ నృత్యం కోర్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. నాలుగేండ్ల ధ్రువపత్రం కోర్సుతోపాటు ఒక సంవత్సరం డిప్లొమా కోర్సు అందుబాటులో ఉన్నది. కర్ణాటక గాత్ర సంగీతాన్ని టి. స్వప్నారాణి, హిందుస్థానీ గాత్రం ఎం. అనిత సేవలందిస్తున్నారు. 11 సంవత్సరాల పైబడి 50ఏండ్లలోపు వారంతా ప్రవేశాలు పొందవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7గంటల వరకు బోధిస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల కళలను నెరవేర్చడానికి రాష్ట్రంలో ఆరు సంగీత నృత్య విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. సకల కళలకు నిలయమైన ఇందూరు నగరంలో ఈ పాఠశాల స్థాపించి 50ఏండ్లు పూర్తవుతున్నది. సంగీత నృత్య కళలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే ప్రతినెలా కళా పరిచయాన్ని ఏర్పాటు చేస్తున్నాం.