డిచ్పల్లి, డిసెంబర్ 12 : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ సీట్ల కేటాయింపు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, 54 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మూడు విడుతలతో పాటు ప్రత్యేక దోస్త్ ప్రక్రియలో 14,435 సీట్లు భర్తీ అయ్యాయి. గతేడాది 33 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉంటే ఈ ఏడాది తగ్గించారు. అయినా సగమే భర్తీ కావడం గమనార్హం.
భారీగా ఖాళీలు
ఏటా డిగ్రీ కళాశాలల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య భారీగా ఉన్నా 50 శాతానికి మించి డిగ్రీలో చేరేందుకు శ్రద్ధ చూపడం లేదని విద్యావేత్తలు అంటున్నారు. ఇంజినీరింగ్, ఇతర కోర్సులు అభ్యసించేందుకు ఆసక్తి చూపడమే కారణమని పేర్కొంటున్నారు.
ప్రైవేట్లో 8 వేల సీట్లకు కోత
అడ్మిషన్లు అంతంత మాత్రంగా ఉన్న కోర్సుల్లో విద్యామండలి సీట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ది. ఇందులో భాగంగా టీయూ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో ఈ ఏడాది 8 వేల సీట్లను తొలగించా రు. దీంతో కళాశాలలు నడపడం కష్టంగా మారిందని ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. నిజామాబాద్లోని గిరిరాజ్, కామారెడ్డి బాన్సువాడలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు పోటీ ఏర్పడుతున్నది.
టీయూ పరిధిలో నాలుగేండ్ల అడ్మిషన్ల వివరాలు
2020-21లో మొత్తం 32,360 కాగా 17,071 భర్తీ అయ్యాయి. 2021-22లో 33,090 సీట్లకు గాను 17,160, 2022-23 లో 26,980 సీట్లకు గాను 14,435 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,545 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినట్లే..
డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన దోస్త్ ప్రక్రియ ముగిసింది. ఈ విద్యా సంవత్సరం సీట్ల సంఖ్య తగ్గింది. ప్రైవేట్ కళాశాలల్లో 8 వేల సీట్లను తొలగించారు. డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది 26,980 సీట్లకు గాను 14,435 భర్తీ అయ్యాయి.
-సంపత్, టీయూ దోస్త్ సమన్వయకర్త