వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల సాగు అంచనాలకు అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచింది. గతేడాది ఎరువుల వాడకాన్ని అనుసరించి ఈ సారి పది శాతం అధికంగానే నిల్వ ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు ఎరువులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, సహకార శాఖలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలతో అన్నదాతపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దీంతో సాగు ఖర్చు సైతం పెరిగిపోతున్నదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, జూన్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానాకాలం సీజన్ ప్రారంభమైంది. జూన్ మొదటి వారం నుంచే వానలు దంచి కొట్టాల్సి ఉన్నప్పటికీ ఆశించిన మేర వానలు కురువలేదు. రైతులంతా యాసంగి పంటను విక్రయించగా తరువాతి పంటల సాగుకు రెడీ అవుతుండగా ముఖం చాటేసిన రుతుపవనాలతో నిరాశకు గురయ్యారు. కేసీఆర్ పరిపాలనలో మండుకాలంలోనూ చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో వరుణుడి రూపంలో ఎదురైన ఇబ్బందిని పక్కకు పెట్టి కేసీఆర్ ఉన్నాడనే ధైర్యంతో వానకాలం సాగుకు రైతన్నలు సిద్ధం అవుతున్నారు. దాదాపు మూడు వారాలు ఆలస్యంగా పలుకరించిన వానలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రేపటి నుంచే రైతుబంధుకు సంబంధించిన నగదు జమ షురూ అవుతుండడం, వానలు మొదలవ్వడంతో జోరుగా… హుషారుగా అన్నట్లుగా సాగుబడి మొదలవ్వబోతున్నది. పంటల సాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నది. బఫర్ స్టాక్తో పాటు వ్యవసాయ శాఖ అంచనాలతో అవసరమయ్యే ఎరువులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గతేడాది వానకాలంలో వినియోగించిన ఎరువుల వాడకాన్ని అనుసరించి ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలను యంత్రాంగం తీసుకున్నది. 10శాతం అధికంగా నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
వానకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి ఎరువుల డిమాండ్ ఉంటుంది. విక్రయ కేంద్రాల వద్ద వీటి కోసం రైతులు వరుస కడుతుంటారు. కొరత ఉంటే వ్యవసాయ పనులు ఆలస్యమవడంతోపాటు దిగుబడులపై అధిక ప్రభావం చూపుతుంది. అందువల్లే ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే సహకార సంఘాలకు తరలింపును వేగవంతం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 2022 వానాకాలం సీజన్లో 59,884 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైంది. ఈసారి 89,836 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని అంచనా వేశారు. డీఏపీ గతేడాది 9,139 మెట్రిక్ టన్నులు వినియోగిస్తే ఈసారి 21,619 మెట్రిక్ టన్నులు సిద్ధం చేశారు.
పొటాష్ 2020 మెట్రిక్ టన్నుల మేర గతేడాది వానకాలంలో పంపిణీ చేయగా ఈసారి 6657 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి తెస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు 36,870 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా ఈసారి 32,383 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో యూరియా 2022 వానకాలంలో 40,707 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఈ వానకాలం సీజన్లో 50వేల మెట్రిక్ టన్నులు అంచనా వేశారు. డీఏపీ గతేడాది 5051 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పుడు 9వేల మెట్రిక్ టన్నులు, పొటాష్ 1257 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 6400 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు గత వానకాలంలో 24,770 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఈసారి 40వేల మెట్రిక్ టన్నుల మేర అందుబాటులోకి తెస్తున్నా రు. ఎరువుల విక్రయానికి సంబంధించి సహకార శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా సహకార సంఘాలకు ఎరువులను చేరవేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా అమ్మితే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయనున్న ఎ రువులు పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్ పరిధిలోని వారికి మాత్ర మే ఎరువులను విక్రయించాలని నిర్ణయించారు.
వానాకాలం సీజన్కు సంబంధించి సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేయగా ఇందులో మొత్తం పంటల విస్తీర్ణం 5లక్షల 12వేల 356 ఎకరాల్లో ఉంది. ఇందులో అత్యధికంగా 4లక్షల 17వేల 943 ఎకరాల్లో వరి ఉండొచ్చని భావిస్తున్నారు. మక్కజొన్న 32,185 ఎకరాలు, సోయాబీన్ 56,715, పత్తి 1803, కంది 1883, పెసర 151, మినుము 125, వేరు శనగ 204, ఇతర పంటలు 347 ఎకరాలుగా ఉంది. అంచనాల మేరకు విత్తనాల కొరత లేకుండా సమృద్ధిగా రైతులకు అందుబాటులో పెట్టేందుకు వరి విత్తు లక్షా 25వేల క్వింటాళ్లు, మక్కజొన్న 2,500 క్వింటాళ్లు, పెసర 12, కంది 75, మినుపు 10, సోయా 17,615, పత్తి 3600, జీలుగ 20వేల క్వింటాళ్లు, జనుము 500 క్వింటాళ్లు చొప్పున రైతులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఈ వానకాలంలో దాదాపు 5.40 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నోచుకోనున్నదని వ్యవసాయ శాఖ చెబుతున్నది. వరి పంటను 3లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 86 వేలు, పత్తి 73వేలు , సోయాబీన్ 72వేలు, కందులు 22వేలు, పెసర్లు, మినుములు 10వేల ఎకరాల్లో, గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని వ్యవసాయ ప్రాంతాల్లో చెరకు 4,100 ఎకరాల్లో సాగు అంచనాలు ఉండొచ్చని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. అంచనాలకు తగ్గట్లుగా 60వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, సోయాబీన్ 18వేలు, 70వేల క్వింటాళ్ల పత్తి విత్తన ప్యాకె ట్లు, మక్కజొన్న విత్తనాలు 4వేల క్వింటాళ్లు, విత్తన కందులు వేయి, పెసర 1500, మినుము 800 క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తున్నారు.
అన్నదాతలపై ఎరువుల భారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రంగా మోపుతున్నది. గతేడాది సీజన్ వరకు పెంచిన ఎరువుల ధరలతో అన్నదాతలంతా కుదేలవుతున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం సాగుపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. పంట సాగులో విత్తనాలు, ఎరువులే కీలకం. ఆశించిన దిగుబడులు పొందేందుకు పంట చివరి దశ వరకు నాలుగైదు సార్లు ఎరువులు వేస్తారు. ఈ లెక్కన ఎకరానికి రూ.3 నుంచి 4 వేలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా అదనంగా రైతులకు ఎకరానికి రూ.1000 నుంచి రూ.2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఉదాహరణకు రైతులు విరివిగా ఉపయోగించే పొటాష్(ఎంవోపీ) గత ధర రూ.850 ఉండగా ప్రస్తుతం రూ.1700 మించి ధర పలుకుతున్నది. ఈ పెంపుతో రైతుకు ఇబ్బందికరమైన దుస్థితి ఏర్పడుతున్నది. సాగు రంగంపై ఆధారపడి జీవిస్తోన్న వారిపై మోడీ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే పార్టీగానే మారిపోయిందనే వాదనను వీరు అనుసరిస్తోన్న విధానాలు నిజం చేస్తున్నాయి. బ్యాంకులకు రూ.వేల కోట్లు అప్పలను ఎగ్గొట్టి దేశాలు వదిలి పెట్టి వెళ్తున్న వారికి రెడ్ కార్పెట్ వేస్తోన్న మోదీ ప్రభుత్వమే… సామాన్య రైతులకు మేలు చేసేందుకు ఒక్క నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అవసరమైన ఎరువులు సహకార సంఘాల్లో నిల్వ ఉన్నాయి. ఇంకా అవసరం అనుకుంటే జిల్లాలో బఫర్ స్టాకు కూడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన అన్ని రకాల ఎరువులు పీఏసీఎస్ల ద్వారా సమకూరే విధంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ముందస్తుగా తీసుకుంటున్న చర్యలతో ఎక్కడా ఎరువుల కొరత అన్నది మచ్చుకూ లేకుండా నివారించగలుగుతున్నాం.
– సింహాచలం, నిజామాబాద్ జిల్లా సహకార అధికారి