నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 17:సంకల్పంతో ఏదైనా సాధించొచ్చని నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూర్ యువత నిరూపిస్తున్నది. గ్రామానికి చెందిన వాయుపుత్ర యువజన సంఘ సభ్యులు దశాబ్దాల నుంచి గ్రామంలో సామాజిక సేవా దృక్పథంతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తమవంతు పాత్రను పోషిస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 100మంది విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని యువజన సంఘం సభ్యులు సంకల్పించారు. ఇదే విషయాన్ని స్థానిక సర్పంచ్ అశోక్, వీడీసీ సభ్యులతో యువజన సంఘం అధ్యక్షుడు రవికాంత్, సభ్యులు చర్చించారు. యువత సంకల్పాన్ని గ్రామపెద్దలు కూడా ఏకీభవించారు. ఇలా 30మంది యువకులు ప్రతినెలా ఒక్కొక్కరూ రూ. 200 జమ చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, పలువురు దాతలు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వెంటనే యువజన సంఘం సభ్యులంతా కలిసి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయురాలు సరోజిని సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఫుడ్ కమిటీని ఎన్నుకున్నారు. నిజామాబాద్లోని హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు తీసుకొచ్చేందుకు ఐదుగురితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నవంబర్ 24వ తేదీ నుంచి పాఠశాలలో రోజూ రెండు రకాల కూరగాయలతో వండిన భోజనాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. వంట చేసేందుకు ఇంతకుముందు ఓ మహిళ ఉండగా ఇప్పుడు మరో ఇద్దరు మహిళలను నియమించారు. శుభ్రతను పాటిస్తూ నాణ్యమైన భోజనం వండి విద్యార్థులకు అందిస్తున్నారు. దీంతో పిల్లలు రెగ్యులర్గా పాఠశాలకు హాజరవుతున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందుతుండడంతో వారి తల్లిదండ్రులూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల ఆరోగ్యం కోసమే..
ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఆరోగ్యం బాగుండాలని నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు మా యూత్ సభ్యులందరం సంకల్పించాం. పౌష్టికాహారంతో కూడిన భోజనం చేస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉండి రోజూ పాఠశాలకు వస్తారు. మధ్యాహ్న భోజనాన్ని యూత్ సభ్యులంతా పర్యవేక్షిస్తున్నారు.
యువతది కీలకపాత్ర..
మా గ్రామాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. యువకులతోపాటు వీడీసీ సభ్యులు, ప్రజలు కూడా పూర్తి సహకారం అందిస్తున్న ఫలితంగా మా గ్రామంలో అభివృద్ధి జరుగుతున్నది. పాఠశాలలో రెండు రకాల కూరగాయల భోజనం వండించి, నాణ్యమైన భోజనం అందిస్తున్న యువత సంకల్పం చాలా గొప్పది. వారి ఆలోచనకు గ్రామపెద్దలు, దాతలు కూడా ముందుకొచ్చి సహకరించడం మంచి పరిణామం.