ఎండకాలం అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటికి అడుగు వేసేందుకే జంకుతున్నారు. పశుపక్ష్యాదులు సైతం ఎండవేడిని తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు చెరువుల్లో నీటిమట్టం తగ్గడం, చేపల సాంద్రత పెరగడంతో ఆక్సిజన్ అందక చనిపోయే ఆస్కారం ఉన్నది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో చేపల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం…
ఎల్లారెడ్డి రూరల్, మే 26: వేసవి కాలంలో చేపల పెంపకంపై తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నారు. ఎండకాలంలో చేపల పెంపకం ఎంతో కీలకం. అధిక ఉష్ణోగ్రతతో చేపల సాంద్రత ఎక్కువగా ఉండడం, నీరు క్రమేపీ తగ్గడం, ప్రాణవాయువుల కొరత తదితర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని కామారెడ్డి జిల్లా మత్స్యశాఖాధికారి కె.వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వేసవికాలంలో చేపలపెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో చేపలు చనిపోతూ ఉంటాయని, రోగకారక సూక్ష్మజీవులతో వ్యాధులు సంభవించే అవకాశాలు కూడా చాలా ఎక్కువవుతాయన్నారు.
ఆక్సిజన్ పెంచేలా చర్యలు తీసుకోవాలి..
చేపలు చనిపోతుంటే, వెంటనే చెరువు పరిస్థితిని గమనించాలి. నీటి నాణ్యత లోపించి చేపలు చనిపోతుంటే ప్రాణవాయువును పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేయాలి. దీంతో విషవాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. అయా సందర్భాల్లో చేపలను పట్టి విక్రయించడం అత్యంత శ్రేయస్కరం.
– కె. వరదారెడ్డి, జిల్లా మత్సశాఖాధికారి