నమస్తే తెలంగాణ యంత్రాంగం : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు. సోమవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో 48.5 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. వందలాది చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలుచోట్ల చెరువులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నందిపేట్ మండలం ఉమ్మెడ పాత గ్రామం వంతెన వద్ద పుష్కరఘాట్ మెట్లు వరద ప్రవాహం తో నీటమునిగాయి. గోదావరి నదిని అనుకొని ఉన్న ఉమామహేశ్వర ఆలయం సమీపం నుంచి వరద ప్రవహిస్తున్నది. మంజీరలో నీటి ఉధృతి పెరగడంతో సాలూరా వద్ద తెలంగాణ- మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దులోని వంతెనపై నుంచి వరద పారుతు న్నది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఈనెల 20న నాందేడ్కు వెళ్ల్లిన ఆర్టీసీ బస్సు రాత్రి అక్కడే ఉండగా, దారి మళ్లించి బోధన్కు తెచ్చేందుకు అధికారులు సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు రెండు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు అధికారులు చర్య లు చేపట్టారు. కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిపై నిర్మించిన హైలెవల్ వంతెనను ఆనుకుని నీరు ప్రవహిస్తున్నది. నదిలోని పురాతన శివాలయం ఉదయం నీటితో మునిగిపోయి శిఖరం మాత్రమే కనిపిస్తున్నది.
చందూర్లో భారీ వృక్షం నేలకొరిగింది. భారీ వర్షాల కారణంగా ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్లో మూడు ఇండ్లు కూలిపోయాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని చక్రధర్నగర్ తండాలో రెండు ఇండ్లు, మల్లారంలో ఒకటి పాక్షికంగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూ ర్ మండల కేంద్రం నుంచి లక్కపల్లి గడ్డకు పోయే రహదారి తెగిపోయింది. మంజీర తీరం వెంట సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పంటలు నీట మునిగింది. నిజాంసాగర్ మండలం నర్వ గ్రామం లో ఓ ఇల్లు కూలిపోయింది. మద్నూర్ మండలంలోని గోజేగావ్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిసోయాయి. సోనాలా, తడిహిప్పర్గ గ్రామాల్లో పంటపొలాల్లోకి నీరు చేరింది. డోంగ్లి మండలంలోని హసన్టాక్లీ వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లింబూర్, హసన్టాక్లీ, పెద్దటాక్లీ గ్రామ శివారులోని పంటపొలాల్లోకి నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. పాల్వంచ మండల పరిధిలోని ఫరీద్పేట్ ఒకటి, భిక్కనూరులో ఒక నివాస గృహం దెబ్బతిన్నది. గాంధారి మండల కేంద్రంతో పాటు, బ్రాహ్మణ్పల్లి, గుర్జాల్, మాతు సంగెం గ్రామాల్లో పలు నివాసపు ఇండ్లు కూలిపోయాయి.
ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్ఫ్లో
మెండోరా, జూలై 21 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ మాణిక్యం తెలిపారు. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి ఉదయం నీటిని విడుదల చేయడంతో 34 వేల క్యూసెక్కులు బాలేగావ్ ప్రాజెక్టుకు చేరుకుని బాబ్లీ ప్రాజెక్టు మీదుగా ఎస్సారెస్పీలోకి చేరుతుందన్నారు. విష్ణుపురి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.5 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా మంజీరలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరే అవకాశముంది. మొత్తం ప్రాజెక్టులోకి లక్షా 38 వేల 512 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కేవలం 20 రోజుల్లోనే 22 టీఎంసీల (11 అడుగుల) వరద వచ్చి చేరింది. ఇందులో కాళేశ్వరం జలాలు 3 టీఎంసీలు వచ్చి చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఢోకా లేకుండా పోయింది. కాకతీయ కాలువ, అలీసాగర్ గుత్ప ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల నిలిపివేశారు. మిషన్ భగీరథ నీటి కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1076.70 అడుగుల (45.200 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. 24 గంటల్లోనే ప్రాజెక్టులోకి 8 టీఎంసీల వరద వచ్చి చేరింది. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1088.50 అడుగుల (78 టీఎంసీటీలు) నీటి నిల్వ ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద
నిజాంసాగర్, జూలై 21 : నిజాంసాగర్, కళ్యాణి, సింగీతం, నల్లవాగు, కౌలాస్నాలా ప్రాజెక్టులోకి శుక్రవా రం ఎగువ భాగం నుంచి భారీగా వరద వస్తున్నది. మెదక్ జిల్లా ఘన్పూర్ ఆనకట్టతో పాటు పోచారం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 30,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు ఏఈ శివ తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1396.33 అడుగులు (7.870 టీఎంసీలు) నీరు నిలువ ఉంది. సింగీతం ప్రాజెక్టు నీటి మట్టం 416.55 మీటర్లు కాగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎగువ భాగం నుంచి 600 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే సింగీతం అడ్డుగోడపై నుంచి నీరు మంజీరలోకి పరవళ్లు తొక్కే ఆవకాశం ఉంది. నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి పొగిపొర్లుతున్నది. కౌలాస్నాలా ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 2,777 క్యూసెక్కుల వరద వస్తున్నదని ఏఈ రవిశంకర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 458.00 మీటర్లకు (1.237 టీఎంసీలు) గాను 453.45 మీటర్ల (0.890 టీంఎసీలు) నీరు నిలువ ఉంది.