దోమకొండ గడికోటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. కామారెడ్డి జిల్లాలో నెలవైన ఈ చారిత్రక వారసత్వ కట్టడానికి తాజాగా యునెస్కో అవార్డు లభించింది. చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటి రక్షణ, విశిష్టత గురించి తెలియజేసేందుకు, వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏషియన్ పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ గడికోటకు అవార్డును ప్రకటించింది. కోట పరిరక్షణ పనులపై మెరిట్ అవార్డు వచ్చింది. దోమకొండ కోటకు అవార్డు రావడంపై కామినేని వారసులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-విద్యానగర్, నవంబర్ 26
చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటి రక్షణ, విశిష్టత గురించి తెలియజేసేందుకు కొన్ని ప్రమాణాలను తీసుకొని వారసత్వ పరిరక్షణ కోసం ఏషియన్ పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ యునెస్కో ఏటా అవార్డులను ప్రకటిస్తున్నది. తాజాగా కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు అవార్డును ప్రకటించింది. కోట పరిరక్షణ పనులపై మెరిట్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా దోమకొండ కోటపై ప్రత్యేక కథనం..
దోమకొండ కోటను స్థానికులు గడీగా పిలుస్తారు. 40ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ రాతి కట్టడంతో కూడిన ప్రహరీతోపాటు బయటి వైపు నుంచి శత్రువులు రాకుండా ఉండేందుకు గోడ చుట్టూ అతిపెద్ద నీటి కందకం కూడా ఉన్నది. దోమకొండ సంస్థానం, తెలంగాణలోనే ప్రాచీన సంస్థానాల్లో పేరుగాంచింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి 20కిలోమీటర్ల దూరంలో దోమకొండ సంస్థానం ఉన్నది. పాకనాటి రెడ్డిశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్ధానాధీశులు. ఈ సంస్ధానానికి భిక్కనవోలు (మెదక్ జిల్లా ) సంస్థానమని నామాంతరం.
ఈ సంస్థానాధీశులు మొదట గోల్కొండ సుల్తానులకు, ఆ తర్వాత ఆసఫ్ జాహీలకు సామంతులుగా దోమకొండ కేంద్రంగా కాసాపురం, సంగమేశ్వరం, మహమ్మదాపురం, విసన్నపల్లి, బాగోత్పల్లి, కుందారం, పాల్వంచ, దేవునిపల్లి వంటి నలభై గ్రామాలను పాలించారు. 19వ శతాబ్దంలో ఈ సంస్థాన సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు. అందుకే ఈ దోమకొండ కోశాగారానికి కాపలాగా 20 మంది అరబ్బులు ఉండే వారు. వీరు రెడ్డి దొరలైనప్పటికీ నిజాం ప్రభువులు వీరికి రావుబహద్దూర్ అనే బిరుదు ఇవ్వడంతో కొంతమంది పాలకుల పేరు చివర రావు అన్నపేరుతో చెలామణి అయ్యారు.
2011 నుంచి పరిరక్షణ పనులు..
దోమకొండ కోట సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవడంలో భాగంగా కోట వారసులు మరమ్మతులు చేపట్టారు. పరిరక్షణ పనులను 2011లో ఆర్కిటెక్చర్ అనురాధ నాయక్ నేతృత్వంలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులోభాగంగా హస్తకళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్థానికంగా దొరికే మెటీరియల్, హస్తకళాకారులతో కలిసి పనులు పూర్తిచేశారు. సాంకేతికతతోపాటు ప్రామాణికమైన వస్తువులను ఉపయోగించారు. కోట పరిరక్షణ పనులు 2022లో పూర్తయ్యాయి. దోమకొండ కోటకు యునెస్కో అవార్డు రావడంపై కోట వంశీయులు, గ్రామస్తులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.
కోట విశేషాలు..
దోమకొండ కోట 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కోట భవనంపై వెంకట భవనం అని తెలుగు, ఉర్దూలో రాసి ఉంది. ఆ కాలంలోనే పిడుగులు పడకుండా నిరోధించే పరికరాన్ని బిగించారు. కోటలో పెద్ద లింగంతో కూడిన మహాదేవుని (శివుడు) ఆలయం, అద్దాల మేడ, నీళ్లను ఎగజిమ్మే ఫౌంటేన్లు, పోచమ్మ ఆలయం, పచ్చని చెట్లతో కూడిన కోట, అందమైన భవనాలు ఉన్నాయి. కోటలో ప్రవేశించేందుకు పడమర వైపు ఒక పెద్ద కమాన్, తూర్పు వైపు మరొక కమాన్, విశాలమైన ప్రాంగణం మధ్యలో సంస్థానాధీశుల ప్రధాన నివాసం, వెంకట భవనం వద్ద ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు,పూలమొక్కల మధ్య రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఇప్పటికీ కామినేని వంశీయులు దోమకొండ కోటను సందర్శిస్తుంటారు. కామినేని వంశీయుల్లో ఏ వివాహం అయినా పోచమ్మ పండుగ చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
కోటను పాలించిన రాజులు..
1936లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజీవాడి మీదనే వెలిశాయి. ఈ వంశానికి చెందిన రాజన్న చౌదరి 1760లో రాజధానిని భిక్కనవోలు నుంచి కామారెడ్డిపేటకు, ఇతని కుమారుడు రాజేశ్వర్రావు పాలనలో కామారెడ్డి పేట నుంచి దోమకొండకు మార్చారు. అప్పటి నుంచి దోమకొండ సంస్థానంగా ప్రసిద్ధి చెందింది.
కామినేని వంశానికి ఆధ్యుడైన కామినేని చౌదరి తర్వాత 15వ తరానికి చెందిన ఉమాపతి రావుకు రామేశ్వరావు, రామచంద్రరావు, రాజేశ్వరావు, సోమేశ్వరరావు, రాఘవేంద్రరావు అనే ఐదుగురు కుమారులు. ఇందులో సోమేశ్వరావుకు రెండో ఉమాపతిరావు, అన్నారెడ్డి, రాజేశ్వరావు అనే కుమారులు ఉన్నారు. ఇందులో రెండో ఉమాపతిరావుకు మూడో రాజేశ్వరావు, రామచంద్రారావు, వెంకటేశ్వరావు అనే కుమారులు. రాజేశ్వరరావుకు రామేశ్వరరావు అనే ఏకైక కుమారుడు. రాజరాజేశ్వరరావు దాదాపు 30సంవత్సరాలు ఈ సంస్థానాన్ని పాలించాడు.
మూడో వాడైన వెంకటేశ్వరావును రాఘవేంద్రరావు కుమారుడైన సదాశివరెడ్డి దత్తత తీసుకోవడంతో రామచంద్రరావు తర్వాత సంస్థానాధికారం గురించి సోమేశ్వరరావుతో గొడవలు ఆరంభమై కోర్టు వరకు వెళ్లాయి. కోర్టు తీర్పు ప్రకారం సోమేశ్వరరావుకు పరిపాలనాధికారం లభించింది కానీ ఆయన కూడా ఎక్కువ కాలం అధికారం చేయలేకపోయాడు. గంగిరెద్దులాడించే వాడిని కొట్టి చంపిన కేసులో అతడికి ఆరు సంవత్సరాలు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని శిక్ష విధించారని స్థానిక గ్రామస్తుల కథనం. సోమేశ్వరావు పాలన సాగుతున్నప్పుడు తెలంగాణ భారత సమాఖ్యలో కలిసిపోవడంతో సంస్థానం రద్దయ్యింది. దీంతో కామినేని వంశస్థులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1954 నుంచి ఆరేండ్లపాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు. 2012లో సినీనటుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్ను కామినేని వంశస్థురాలు ఉపాసన వివాహం చేసుకున్న తర్వాత దోమకొండ కోటకు మరింత ఆదరణ లభించింది. చిరంజీవి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోటను మరింత అభివృద్ధి చేశారు.