నిజామాబాద్ స్పోర్ట్స్, అక్టోబర్ 22 : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఈవీఎంల తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, చిత్రామిశ్రా పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల తరలింపు ప్రక్రియ సాఫీగా ముగిసింది. రాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా, పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈసీ సూ చనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఈవీఎంలను తరలించారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రాజేంద్రకుమార్,రాజాగౌడ్, భుజంగరావు, వినోద్కుమార్, సహాయ రి టర్నింగ్ అధికారులు, ఎన్నికల విభా గం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.