ఖలీల్వాడి, ఫిబ్రవరి 20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను పీఎం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తున్నదన్నారు. నిజామాబాద్లో 7.5ఎకరాల విస్తీర్ణంలో రూ.22కోట్లతో నూతన భవనం నిర్మించామని, ప్రస్తుతం ఇక్కడ 10వ తరగతి వరకు అనుమతి ఉండగా, త్వరలోనే 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. బోధన్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు.
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందుతున్నదన్నారు. పిల్లలను చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలు వేయాలని కలెక్టర్ సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న వారు దేశభక్తిని పునికిపుచ్చుకుంటారన్నారు. విద్యాలయ ఆవరణలో చదువుల తల్లి సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అవసరమయ్యే నిధులను తాను సమకూరుస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంస్థల హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ మంజునాథ, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మమత, విద్యార్థులు, తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.