Haj yatra | కామారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని భావిస్తాడు. పవిత్ర స్థలమైన మక్కా షరీఫ్లో హజ్ చేసేందుకు రాష్ట్రం నుంచి యాత్రికులు పయనమవుతున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు కొనసాగే హజ్ ప్రార్థనల కోసం ఈ సారి రాష్ట్రం నుంచి 5,278 మంది యాత్రికులు తరలుతున్నారు. 22వ తేదీ వరకు విమానాల్లో యాత్రికులు రోజుకొందరు బయల్దేరి వెళ్తున్నారు. జిల్లాల నుంచి వెళ్లేవారు ముందుగా హైదాబాద్లోని హజ్హౌస్కు చేరుకుంటారు. అక్కడ హజ్కు సంబంధించిన నియమ నిబంధనలను యాత్రికులకు వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్ హౌస్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. హజ్ కమిటీ చైర్మన్ సలీం ప్రత్యేక శ్రద్ధతో యాత్రికుల కోసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతస్థాయి సౌకర్యాలు కల్పించడంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి 481 మంది యాత్రికులు..
హజ్ యాత్ర కోసం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 8,659 మంది దరఖాస్తు చేసుకోగా 8,104 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో లక్కీడ్రా ద్వారా 5,278 మంది హజ్కు ఎంపికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి 394 మంది, కామారెడ్డి నుంచి 87 మంది హజ్కు వెళ్తున్నారు. హజ్ కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలను మెరుగుపర్చడంతోపాటు సీట్ల సంఖ్యను పెంచడంతో జిల్లా వాసులకు సౌలభ్యంగా మారింది. హజ్ యాత్ర పూర్తిచేసేందుకు ఒక్కొక్కరికీ దాదాపు రూ.3.21లక్షలు ఖర్చవుతుంది.
హజ్ అంటే..
రంజాన్ ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత రెండు నెలలకు వచ్చే జీల్ హజ్జా మాసంలో హజ్ యాత్ర చేస్తారు. సౌదీ అరేబియాలోని మక్కా షరీఫ్కు వెళ్లి అక్కడ ఖానే కాబా ముందు సుమారు 20 రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేయడాన్ని హజ్గా పేర్కొంటారు. హజ్, ఉమ్రాకు వెళ్లేవారు అల్లాహ్కు ముఖ్య అతిథులు. వారి వేడుకోలును దేవుడు స్వీకరిస్తాడు. అర్థిస్తే క్షమిస్తాడు. హజ్ చేయాలని నిశ్చయించుకున్న వ్యక్తి త్వరపడాలి. లేదంటే వివిధ కారణాలతో ఆటంకాలు కలుగవచ్చని మహ్మద్ ప్రవక్త పేర్కొన్నారు. ఖురాన్లోనూ హజ్ గురించి ఉన్నది. స్థోమత ఉన్న ప్రతిఒక్కరూ దైవ ప్రసన్నత కోసం హజ్ చేయాలి. ప్రాపంచిక లాభాపేక్షతో పవిత్రమైన లక్ష్యాన్ని మలినపర్చొద్దని ఖురాన్లో ఉన్నది.
యాత్ర నియమాలు..
హజ్ అంటే తన సర్వస్వాన్ని దైవానికి సమర్పించుకునే యాత్ర. హజ్ యాత్ర చేపట్టినవారిని హాజీలుగా వ్యవహరిస్తారు. మహ్మద్ ప్రవక్త హజ్ యాత్రకు వెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. హజ్కు వెళ్లే విషయాన్ని, ఆడంబరాలను ప్రదర్శించొద్దు. మౌనంగా వెళ్లి రావాలి. యాత్రకు వెళ్లేముందు తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది, దైవాన్ని క్షమాభిక్ష వేడుకోవాలి. ప్రయాణంలో ఉత్తమ సామగ్రిని ఎంచుకోవాలి. ప్రయాణంలో ప్రతిచోటా జనం కిక్కిరిసి ఉంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. పాపకార్యాలు, ఘర్షణ వంటివాటికి దూరంగా ఉండాలి. మనోనిగ్రహం అవసరం. విశాల హృదయం, త్యాగబుద్ధితో మెలగాలి. ధర్మ చింతన నింపుకోవాలి. హజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా జీవితకాలంపాటు ఆదర్శంగా, పాప కార్యాలకు దూరంగా ఉండాలి.
రాష్ట్ర సర్కారు అన్ని విధాలా సహకరిస్తున్నది..
హైదరాబాద్లోని హజ్ హౌస్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలనూ కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే యాత్రికులు ఇక్కడ ఉంటారు. వారికి ఇబ్బందులు కలుగకుండా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్నది. హజ్ భక్తులకు అన్ని విధాలా సహకరిస్తున్నది.
–ముజీబుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్
అన్ని సౌకర్యాలు కల్పించారు..
హజ్ యాత్రకు వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యా లు కల్పించింది. హజ్ హౌస్లో ఎలాంటి ఇబ్బందులూ లేవు. హజ్ యాత్రికులకు నేను 20 ఏండ్లుగా సేవలందిస్తున్నా. మక్కాకు వెళ్లాలనుకునేవారికి పాస్పోర్టు నుంచి మొదలుకొని అన్ని విధాలా సహకరిస్తా. బాన్సువాడ నుంచి 38 మంది హజ్కు వెళ్తున్నారు.
–అల్తమష్, హజ్ కమిటీ బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు
ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
హజ్ యాత్రకు కామారెడ్డి జిల్లా నుంచి 83 మంది వెళ్తున్నారు. మూడు రోజులుగా యాత్రికులు బయల్దేరుతున్నారు. హజ్హౌస్లో విడిది ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత సమయాల్లో ఎయిర్పోర్టుకు వెళ్తారు. హజ్ యాత్ర ప్రశాంతంగా సాగేవిధంగా ఏర్పాట్లు చేశాం.
–అహ్మద్ పాషా సాబ్రి, హజ్ కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి..
స్థోమత ఉన్న ముస్లిములు ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలి. పూర్తిగా దైవ ధ్యాసలోనే మునిగిపోవాలి. ప్రపంచంతో సంబంధం లేకుండా నమాజులు పూర్తి చేయాలి. అప్పుడే హజ్ యాత్ర పూర్తి అవుతుంది.
–మౌలానా రఖీబ్ ఖాస్మి,హజ్ యాత్రికుడు, బాన్సువాడ