ఖలీల్వాడి, ఏప్రిల్ 15: రోగిని లాగుతూ తీసుకెళ్తున్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్నదని ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు. నిజామాబాద్ జీజీహెచ్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 31వ తేదీన మద్యం సేవించిన వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అతడి బంధువులు దవాఖానకు తీసుకువచ్చారు. అక్కడ ఉన్న వైద్యులు పరీక్షించి అతడిని సైకియాట్రిక్కు చూపించాలని సూచించారు. వారు ఆలోచించి చెబుతామని చెప్పడంతో.. పేషెంట్ కేర్ సిబ్బంది రోగిని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి పేషెంట్లు వేచి ఉండే హాల్లో ఉండమని, ఏమైనా సమస్య ఉంటే తమను సంప్రదించమని చెప్పారు.
అనంతరం రోగిని వారి బంధువులు లాగుతూ తీసుకెళ్తుండగా చూసి.. ఎందుకలా తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. వీడియో ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా.. వీడియో తీసే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పేషెంట్ విషయంలో తమ సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదు.. దవాఖాన సిబ్బందిపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సూపరింటెండెంట్ అన్నారు. వీడియో తీసిన వ్యక్తి రోగికి సహాయం చేయకపోగా.. విషయాన్ని తమ దృష్టికి తేలేదని, ఘటన జరిగిన 15 రోజులకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని గమనించాలన్నారు. పూర్తి అవగాహన లేకుండా ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం పోయేలా ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
దవాఖానలో స్రైచర్లు, వీల్చైర్లు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం వైద్యశాలలో 57 స్ట్రెచర్లు, 51 వీల్చైర్లు ఉండగా.. మరో41 వీల్చైర్లు స్టోర్ రూములో అందుబాటులో ఉన్నాయన్నారు. దవాఖానలో సుమారు 200 సీసీ కెమెరాలు ఉన్నాయని.. ఎక్కడ, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దవాఖానలో సేవలపై దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జరిగిన ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆమె స్పష్టంచేశారు.