ఆర్మూర్ పట్టణ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు. దారులన్నీ సిద్ధులగుట్ట బాటపట్టాయి. గులాబీ జెండాలను చేతపట్టుకొని, మెడలో కండువా వేసుకొని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రసంగాన్ని ప్రజలంతా ఓపికగా విన్నారు. ఆర్మూర్ ప్రజలు, రైతులు, అంకాపూర్ గ్రామంపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని సీఎం కేసీఆర్ చెబుతున్నంతసేపు చప్పట్ల మోతమోగింది. ఎమ్మెల్యే జీవన్రెడ్డిని కొనియాడుతూ ఆర్మూర్ అభివృద్ధి కోసం ఆయనపడే తపనను వివరించారు. జనమంతా జయహో కేసీఆర్.. జై జీవన్రెడ్డి అంటూ చేసిన నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
గులాబీల జెండలె.. రామక్క… గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో రామక్క అంటూ సభా ప్రాంగణంలో కళాకారులు పాడిన పాటలకు వేదికపై ఉన్న నేతలంతా స్టెప్పులేశారు. వారితోపాటు సభ ఆవరణలోని జనమంతా గులాబీ కండువాలు ఊపుతూ…డ్యాన్స్ చేశారు.
ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డా.మధుశేఖర్, మార గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినీత, మహారాష్ట్ర రైతు సంఘం నాయకులు అన్నాసాబ్ మానే, ఘన్శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.