ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్నపాటి ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించి నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాక్లూర్ మండలం బొంకన్పల్లి గ్రామానికి చెందిన గడాల రాణి తన భర్తతో విడాకులు తీసుకుని మరొక వ్యక్తితో సహజీవనం చేస్తుంది.
నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనులు చేస్తూ నగరానికి చెందిన ఆటోడ్రైవర్ గణేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పలుమార్లు అనుమానంతో గణేశ్ రాణితో గొడవ పడ్డాడు. వారం రోజుల క్రితం ఆమెను మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్లంగి గ్రామ శివారుకు ఆటోలో తీసుకెళ్లి చీరకొంగుతో ఆమెను హతమార్చి గోనె సంచిలో వేసి డిజీల్ పోసి దహనం చేశాడు.
సంఘటన స్థలం వద్ద దొరికిన ఆభరణం, ఇటీవల పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన వారి జాబితా ప్రకారం కేసును పరిశోధించి శవాన్ని రాణిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఏసీపీ వెల్లడించారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ గురునాథ్, మాక్లూర్ ఎస్సై రాజ్రెడ్డి, ప్రొబెషనరీ ఎస్సై సీరియస్గాను, పోలీసులను ఏసీపీ అభినందించారు.