రుద్రూర్, మార్చి14 : మండలంలోని అక్బర్నగర్ గ్రామానికి చెందిన బురిగెడి సైదవ్వ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగలపై ఆశతోనే హతమార్చినట్లు గుర్తించారు. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను బోధన్ ఏసీపీ కిరణ్కుమార్ వెల్లడించారు. సైదవ్వ తరచూ అక్బనగర్ నుంచి వర్నికి వెళ్లి కల్లు తాగి వచ్చేది. ఈ నెల 4న వర్నికి వెళ్లిన ఆమె.. తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె కుమారుడు గంగారాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 6వ తేదీన సైదవ్వ మృతదేహాన్ని నిజాంసాగర్ కాలువలో గుర్తించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. కల్లు తాగేటప్పుడు పరిచయమైన బొమ్మన్దేవుపల్లి గ్రామానికి చెందిన పిల్ల అశోక్, ఆయన మరదలు లక్ష్మి.. సైదవ్వ ఒంటిపై ఉన్న ఆభరణాలపై కన్నేశారు. మాయమాటలు చెప్పి సైదవ్వను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి హత్యచేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకొని మృతదేహాన్ని నిజాంసాగర్ కాల్వలో పడేశారు. నిందితులను అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసులు బాబూరావు, రఘు, యాదగిరి, శ్రీకాంత్ను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో సీఐ జాన్రెడ్డి, ఎస్సై రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.