బాన్సువాడ, జనవరి 5: నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ ఆదివారం తెలిపారు. నలుగురు ఉపాధ్యాయులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
విద్యాలయంలో కొంతకాలంగా విద్యార్థినులతో కొందరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవరిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో అధికారులు ఓ ఉపాధ్యాయుడిని వారం రోజుల క్రితం కర్ణాటక రాష్ర్టానికి బదిలీ చేశారు.
నవోదయ పాఠశాలలో సీటు వస్తే తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎంతో మంది తల్లిదండ్రులు కలలు కని, కష్టపడి చదివించాలనుకుంటారు. కానీ కొంతకాలంగా కొందరు ఉపాధ్యాయుల చేష్టలతో పాఠశాలకు చెడ్డపేరు వస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం, లైంగిక వేధింపుల వంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.