నిజాంసాగర్, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమ తీరుపై ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జనాభా ఆధారంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. కౌంటర్ల ద్వారా ప్రజలకు దరఖాస్తు ఫారాలను అందజేసి..మళ్లీ స్వీకరించాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మండలంలో ప్రతిరోజూ మూడు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తుఫారాలను స్వీకరిస్తున్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని మాగి, వెల్గనూర్, మహ్మద్నగర్ మండలంలోని నర్వ గ్రామంలోప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు కార్యక్రమం కొనసాగనుండగా.. మధ్యాహ్నం భోజనం కోసం విరామ సమయం కేటాయించారు.
ఉదయం 8 గంటలకే అధికారులు హాజరుకావాల్సి ఉండగా మాగి గ్రామంలో 9 గంటలు గడిచినప్పటికీ ఏ ఒక్క అధికారి హాజరుకాకపోవడం గమనార్హం. తహసీల్దార్ భిక్షపతి ఒక్కరే హాజరైనప్పటికీ మిగతా అధికారుల కోసం ఆయన సైతం ఎదురుచూడాల్సి వచ్చింది. వెల్గనూర్ గ్రామంలో సైతం ఇదే తంతు కొనసాగగా.. నర్వ గ్రామంలో ఉదయం 9:15 గంటలకు కార్యక్రమం కోసం టెంటు వేసే పనులును చేపట్టారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారు అక్కడే అధికారుల కోసం ఎదురుచూస్తూ బైఠాయించారు. ఇక నర్వ గ్రామంలో కార్యక్రమానికి వచ్చిన వారికి దరఖాస్తు ఫారాలు అందకపోవడతో అక్కడే నిరీక్షించారు. దరఖాస్తు ఫారాలు అయిపోయాయని మరో గంటలో వస్తాయని తెలుపడంతో అక్కడే నిరీక్షించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు మమ అనిపిస్తూ కొనసాగిస్తున్నారని.. ఏ అధికారి కూడా సమయపాలన పాటించడం లేదని ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో నాగేశ్వర్ను సంప్రదించగా.. చలి ప్రభావంతో కొంత ఆలస్యంగా కార్యక్రమం కొనసాగిస్తున్నామని..ఇకనుంచి అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.