బాన్సువాడ టౌన్, జూలై 19 : ప్రజల కష్టాలు తీర్చడంతోపాటు మెరుగైన వసతులను కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై తన స్వగృహంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించకుండా పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయించాలని స్పీకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వందల కోట్ల రూపాయలను బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రతిసారీ అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. సెప్టెంబర్ వరకు పూర్తి చేయకపోతే ఆ నిధులను వేరే పనులకు కేటాయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలను పాటించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఏ విధంగా లబ్ధిపొందుతున్నారో అందరికీ వివరించాలన్నారు.
ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండండి..
వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత ఇండ్లు ఉంటే వెంటనే ఖాళీ చేయించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి దరిచేరుతుందని తెలిపారు. సమీక్షా సమావేశంలో రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, బాన్సువాడ ఈఈ సమత, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, బుడ్మి సొసైటీ చైర్మన్ గంగారాం, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఈ గోపి, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.